మా గ్రామానికి ఎన్నికలు రద్దు చేయండి 

8 Feb, 2021 04:39 IST|Sakshi
ధర్నా చేస్తున్న న్యూ వెల్లంపల్లి వాసులు

న్యూ వెల్లంపల్లి గ్రామస్తుల ఆందోళన  

పిడుగురాళ్లరూరల్‌ (గురజాల):  తమ గ్రామంలో పంచాయతీ ఎన్నికలు రద్దు చేయాలని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండల పరిషత్‌ కార్యాలయం వద్ద న్యూ వెల్లంపల్లి గ్రామస్తులు ఆదివారం ఆందోళన చేపట్టారు. గతంలో మాచవరం మండలంలోని పులిచింతల ముంపు గ్రామంగా వెల్లంపల్లి ఉంది. ఈ ముంపు వాసులకు పిడుగురాళ్ల మండలంలోని బ్రాహ్మణపల్లి శివారులో నివాసం కల్పించారు. ఆ నివాస ప్రాంతాన్ని న్యూ వెల్లంపల్లి గ్రామ పంచాయతీగా పరిగణిస్తున్నట్లు 2020లో ప్రభుత్వం నుంచి ఉత్వర్వులు అందాయి.

ఈ పంచాయతీకి 2019 ఓటర్ల లిస్టు ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం గ్రామంలో నివసించేవారంతా వేరువేరు గ్రామాలకు చెందిన వారని, గతంలో తాము కోర్టుకు వెళ్లగా న్యూ వెల్లంపల్లిలో ఇప్పుడు నివసిస్తున్న వారితోపాటు కొత్త ఓటర్ల లిస్టు తయారు చేయాలని కోర్టు ఆదేశించిందని వివరించారు. అయినా అధికారులు స్పందించడం లేదని ఆరోపిస్తూ ధర్నా చేశారు. అధికారులు స్పందించి కొత్త లిస్టు వచి్చన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. దీనిపై ఎంపీడీవో కాశయ్య స్పందిస్తూ ఎన్నికల నిర్వహణ తమ చేతుల్లో లేదని, అధికారుల ఆదేశాల మేరకే పనిచేస్తున్నామని చెప్పారు.   

మరిన్ని వార్తలు