3 రాజధానులకు అనుకూలంగా విశాఖలో ర్యాలీ

26 Aug, 2020 19:11 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : మూడు రాజధానులకు అనుకూలంగా విశాఖలో ర్యాలీ నిర్వహించారు. బాబాసాహెబ్ అంబేడ్కర్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు విశాఖ వాసులు పాలాభిషేకం చేశారు. విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌తో పాటు రాష్ట్రంలో మూడు రాజధానుల అంశానికి అనుకూలంగా తీర్పు రావాలని కోరుతూ విశాఖలో ప్రజలు ర్యాలీ నిర్వహించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం కన్వీనర్ కేకే రాజు ఆధ్వర్యంలో స్థానిక తాటి చెట్ల పాలెం జంక్షన్ నుంచి ధర్మ నగర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నారని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆలోచనతో రాష్ట్రం అంతటా ప్రధానంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి బాటలు పడుతుంటే చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారని విమర్శించారు.

మరోవైపు ఏయూ వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నేత కాంతారావు ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహనీకి పాలాభిషేకం చేశారు. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలంటూ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న టీడీపీ ఎమ్యెల్యేలు రాజీనామ చేయాలని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ ప్రేమనందం, విద్యార్థి విభాగం నేత మోహన్ బాబు, బాబా, దేవరకొండ మార్కండేయులు, నాన్ టీచింగ్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు