శాస్త్రోక్తం కైశికద్వాదశి ఆస్థానం

25 Nov, 2023 03:00 IST|Sakshi

తిరుమల:  కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో శుక్రవారం కైశిక ద్వాదశి ఆస్థానం  శాస్త్రోక్తం నిర్వహించారు. ఉదయం 4.45 నుంచి 5.45 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. వేంకటతురైవార్, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధులలో ఊరేగిస్తారు.

అనంతరం ఉదయం 6 నుంచి ఉదయం 7.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లను బంగారు వాకిలి చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని  శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుమల పెద్ద జీయర్‌స్వామి, తిరుమల  చిన్నజీయర్‌స్వామి, టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు పలువురు పాల్గొన్నారు.తిరుమల వసంత మండపంలో శ్రీతులసి దామోదర పూజ ఘనంగా నిర్వహించారు. అలాగే తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి శాస్త్రోక్తం జరిపారు. 

26న కార్తీక పర్వదీపోత్సవం..27న పౌర్ణమి గరుడసేవ 
శ్రీవారి ఆలయంలో ఆదివారం సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవం జరగనుంది. శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివే­దనలు పూర్తయిన తర్వాత ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో సహస్రదీపాలంకరణ సేవను టీటీడీ రద్దు చేసింది. కాగా, పౌర్ణమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఈ నెల 27న గరుడసేవ జరగనుంది. రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.

మరిన్ని వార్తలు