నాగార్జున సాగర్‌ డ్యామ్‌ వద్ద ఉద్రిక్తత

30 Nov, 2023 08:16 IST|Sakshi

సాక్షి, పల్నాడు జిల్లా: ఏపీ పోలీసులపై తెలంగాణ పోలీసులు దౌర్జన్యానికి దిగారు. నాగార్జునసాగర్ డ్యామ్‌పై తమ పరిధిలో ఫెన్సింగ్ వేసుకోవడానికి ఇరిగేషన్ అధికారులు పోలీసుల సహకారం కోరారు. వారికి సెక్యూరిటీ కల్పించడానికి సాగర్‌ డ్యామ్‌పై వెళ్లడానికి ఏపీ పోలీసులు ప్రయత్నించారు.

సాగర్ డ్యామ్‌పైకి ఏపీ పోలీసులను, ఏపీ ఇరిగేషన్ అధికారులను వెళ్లకుండా తెలంగాణ పోలీసులు గేటు వేసి అడ్డుకున్నారు. గేటు తీయమని శాంతియుతంగా ఎంత చెప్పినా తెలంగాణ పోలీసులు వినలేదు. ఆంధ్రప్రదేశ్ వైపు ఉన్న గేటుకు సంబంధించిన సెన్సార్‌ను తెలంగాణ పోలీసులు పగలగొట్టారు. ఏపీ ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు వారికి సెక్యూరిటీ కల్పించారు. పోలీసుల సహకారంతో సాగర్ డ్యామ్‌పై ఏపీ సరిహద్దుల్లో తమ పరిధిలో ఇరిగేషన్ అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.

ఇన్ని రోజులు లేని హడావుడి పోలింగ్‌ రోజే ఎందుకు?: కోమటిరెడ్డి
సాగర్‌ డ్యామ్‌పై పోలీసుల హడావుడి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందిస్తూ.. సాగర్‌ డ్యామ్‌పై పోలీసుల డ్రామా కేసీఆర్‌ పనేనన్నారు. ఓడిపోతున్నారని కేసీఆర్‌కు అర్థమై తెలంగాణ సెంటిమెంట్‌ రగిలిస్తున్నారని మండిపడ్డారు. ఇన్ని రోజులు లేని హడావుడి పోలింగ్‌ రోజే ఎందుకు అవుతోందని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్‌ ఎన్నికల కోసం వాడుతున్నారని కోమటిరెడ్డి దుయ్యబట్టారు.
చదవండి: ఎన్నికల బరిలో ఢీ అంటే ఢీ

మరిన్ని వార్తలు