సాక్షి, తిరుపతి: అలిపిరి-తిరుమల నడకదారిలో మరోమారు చిరుత, ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. ఈ మేరకు భక్తులను అప్రమత్తం చేస్తూ శుక్రవారం రాత్రి తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఒక ప్రకటన విడుదల చేసింది.
అలిపిరి నడక మార్గంలో ఈనెల 24 నుంచి 27వ తేదీ మధ్యలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి రిపీటర్ మధ్య ప్రాంతంలో చిరుత, ఎలుగుబంటి తిరుగుతున్నట్లు కెమెరా ట్రాప్లో నమోదైంది. దీంతో నడకదారిలో భక్తులు గుంపులుగా వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. వరుస దాడుల ఘటనల తర్వాత.. ఈ మార్గంలో ప్రత్యేక ఆపరేషన్ల ద్వారా పలు చిరుతలను బంధించిన విషయం తెలిసిందే.
భక్తుల భద్రత తమకు మొదటి ప్రాధాన్యం అని చెబుతున్న టీటీడీ.. ఈ మేరకు అవసరమైన చర్యలను తీసుకుంటోంది. మరోవైపు నడక మార్గంలో ఫెన్సింగ్ ఏర్పాటు పరిశీలనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నిపుణుల కమిటీ ఈ ప్రాంతంలో సర్వే చేపట్టింది.
►అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత, ఎలుగు బంటి సంచారం రికార్డయ్యింది. నరసింహస్వామి ఆలయం నుంచి ఏడవ మైలు ప్రాంతంలో అటవీశాఖ అధికారులు వీటి సంచారం గుర్తించారు. మూడు రోజులుగా వేకువజామున, రాత్రి సమయాల్లో అవి సంచరిస్తున్నాయి. భక్తుల భద్రత దృష్ట్యా భద్రతా సిబ్బందిని టీటీడీ అప్రమత్తం చేసింది. నడకదారి భక్తులు అప్రమత్తంగా ఉండాలి
:::వైల్డ్ లైఫ్ అధికారులు