Underground House In Kadapa: వైఎస్సార్‌ జిల్లాలో బయటపడ్డ భూ గృహం

24 Jan, 2022 05:14 IST|Sakshi
బయల్పడిన భూగృహం

కడప సమీపంలో వెలుగు చూసిన భూగృహం  

రెండు రోజుల్లో పరిశీలిస్తామన్న పురావస్తు శాఖ అధికారులు..

కడప కల్చరల్‌: వైఎస్సార్‌ జిల్లా కేంద్రం కడప నగర సమీపంలో భూ గృహం వెలుగు చూసింది. ఓ యూట్యూబర్‌ ముందుగా దానిని గమనించి కథనాలు ప్రసారం చేయడంతో అది వెలుగులోకి వచ్చింది. నగరానికి దాదాపు 25 కి.మీ దూరంలో ఉన్న నిర్మానుష్య ప్రాంతం, పైగా శ్మశానం కావడంతో అటువైపు ఎవరూ వెళ్లరు. అయితే యూట్యూబర్‌ వెలుగులోకి తేవడంతో దానిపై ఎవరికి వారు  కథనాలు, ఊహాగానాలను ప్రచారం చేస్తున్నారు.

రాజుల కాలం నాటి కారాగారమని, ఖైదీలను అక్కడ చిత్రహింసలు పెట్టేవారని, సమీపంలో బుగ్గవంక ప్రాజెక్టు ఉండటంతో ఆ గృహం నీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన సంపు అయి ఉండొచ్చని ప్రచారాలు సాగాయి. నవాబులు లేదా బ్రిటీషు కాలం నాటి రాచభవనాల వరండాలను పోలి ఉందని మరికొందరంటున్నారు. సైనికులు తలదాచుకునే బంకర్‌ అయి ఉండొచ్చని చరిత్రకారులు, పురావస్తుశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.  సైనిక పటాలాలకు అనుకూలంగా రైల్వే ట్రాక్‌ సమీపంలో నిర్మించుకుంటారని కూడా వారు చెబుతున్నారు. రెండు మూడు రోజుల్లో వెళ్లి పరిశీలిస్తామని పురావస్తు శాఖ అధికారులు చెప్పారు. 

మరిన్ని వార్తలు