ఒంగోలు: బ్యాంకులో కాల్పుల కలకలం.. సెక్యూరిటీ గార్డ్‌ ఆత్మహత్య

5 Jun, 2023 16:59 IST|Sakshi

సాక్షి ప్రకాశం: ఒంగోలులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కోర్టు సెంటర్‌లోని యూనియన్‌ బ్యాంక్‌లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్‌ ఎం. వెంకటేశ్వర్లు(35) తుపాకీతో తనను తానే కాల్చుకుని మృతిచెందాడు. దీంతో, ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 

వివరాల ప్రకారం.. యూనియన్‌ బ్యాంక్‌లో వెంకటేశ్వర్లు సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. అయితే, సోమవారం విధుల్లో ఉండగా.. బ్యాంక్‌లోని రూమ్‌లోకి వెళ్లి గన్‌తో తనను తానే కాల్చుకున్నాడు. ఈ క్రమంలో పెద్ద శబ్ధం రావడంతో బ్యాంకు సిబ్బంది వెంటనే వెళ్లి చూడగా వెంకటేశ్వర్లు రక్తపు మడుగులో పడిఉన్నాడు. దీంతో, బ్యాంకు సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. 

ఇక, చీమకుర్తికి చెందిన వెంకటేశ్వర్లు కొంతకాలంగా యూనియన్‌ బ్యాంకులో సెక్యూరిటీగా గార్డుగా పనిచేస్తున్నాడు. వెంకటేశ్వర్లు కుటుంబం ఒంగోలు రామ్‌నగర్‌లోని 8వ లైన్‌లో నివాసం ఉంటోంది. ఏడేళ్ల క్రితం ఉమామహేశ్వరితో వెంకటేశ్వర్లకు వివాహం జరిగింది. వీరికి సంతానం లేనట్టు తెలుస్తోంది. కాగా, వెంకటేశ్వర్ల ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చదవండి: విషాదం: ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు చిన్నారులు మృతి.. కారణం ఇదే..


 

మరిన్ని వార్తలు