96 శాతం పోలీసులకు వ్యాక్సినేషన్‌

5 May, 2021 04:24 IST|Sakshi

ప్రత్యేక వర్క్‌షాప్‌లో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇప్పటివరకు 96 శాతం మంది పోలీసులకు మొదటి డోసు వ్యాక్సిన్, 76 శాతం మందికి రెండో డోస్‌ పూర్తయినట్టు డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. మిగిలిన వారికి కూడా వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏపీ పోలీస్‌ శాఖ, అపోలో ఆస్పత్రి వైద్యుల సమన్వయంతో మంగళవారం వెబినార్‌ ద్వారా ప్రత్యేక వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. కరోనాపై జరుగుతున్న యుద్ధంలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ను రక్షించుకోవడం ద్వారా సమాజానికి భద్రత కలుగుతుందన్నారు. వైరస్‌ను జయించిన పోలీస్‌ సిబ్బంది ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.

అపోలో ఆస్పత్రి వైద్యుడు డాక్టర్‌ సాయిప్రవీణ్‌ మాట్లాడుతూ ప్రజల ప్రాణాలను కాపాడడంలో ఏపీ పోలీస్‌ శాఖ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. రీసెర్చ్, అనుభవం పంచుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. క్రిటికల్‌ కేసులకు వైద్యం అందించడం, సూచనలు చేయడం వంటి సౌకర్యాలను పోలీస్‌ సిబ్బందికి అందిస్తామన్నారు. వైద్యులు సుబ్బారెడ్డి, మంజులరావు పోలీసులకు పలు సూచనలు చేశారు. శాంతి భద్రతల అడిషనల్‌ డీజీ డాక్టర్‌ రవిశంకర్‌ అయ్యన్నార్, డీఐజీ పాలరాజు, రిటైర్డ్‌ ఐపీఎస్, వెల్ఫేర్‌ ఓఎస్డీ రామకృష్ణ, పలువురు సీనియర్‌ ఐపీఎస్‌లు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు