కౌంటింగ్‌ అక్రమాలపై కోర్టును ఆశ్రయిస్తాం: వెన్నపూస రవీంద్రారెడ్డి

18 Mar, 2023 19:59 IST|Sakshi

సాక్షి, అనంతపురం: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్‌ కేంద్రంలో వైఎస్సార్‌సీపీ నేతలు ఆందోళనకు దిగారు. రీకౌంటింగ్‌ చేయాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్‌ చేశారు. కౌంటింగ్‌ సందర్భంగా వైఎ‍స్సార్‌సీపీ, ఇండిపెండెంట్‌ ఓట్లు టీడీపీ ఖాతాలో వేశారని నిరసనకు దిగారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘాలనికి వైఎస్సార్‌సీపీ లేఖ రాసింది. 

ఈ సందర్బంగా వెన్నపూస రవీంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నైతిక విజయం వైఎస్సార్‌సీపీదే. కౌంటింగ్‌ అక్రమాలపై కోర్టును ఆశ్రయిస్తాం. ఓట్ల తారుమారుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. తొలి రెండు రౌండ్లు నాకు మోజారిటీ వచ్చింది. ఇండిపెండెంట్‌ అభ్యర్థి తరఫున టీడీపీ సీనియర్‌ నేతలు కౌంటింగ్‌ ఏజెంట్లుగా ఉండటం అనైతికం. వైఎస్సార్‌సీపీ, ఇండిపెండెంట్‌ ఓట్లు టీడీపీ ఖాతాలో వేశారు. ఈ సందర్బంగా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు స్పందన రాలేదు. 10 రౌండ్లలో మాకు మెజార్టీ వచ్చిందని స్పష్టం​ చేశారు. 

ఈ క్రమంలోనే వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య మాట్లాడుతూ.. కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయి. వైఎస్సార్‌సీపీ, ఇండిపెండెంట్ ఓట్లు టీడీపీ ఖాతాలో వేశారని పదేపదే ఫిర్యాదు చేసినా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు. కౌంటింగ్ కేంద్రంలో జరిగిన అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టును కూడా ఆశ్రయిస్తామన్నారు. వైఎస్సార్‌సీపీ ఓట్లను టీడీపీ ఖాతాలో జమ చేసినా అధికారులు పట్టించుకోలేదు. వెంటనే రీకౌంటింగ్ జరపాలని డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు