విజయవాడ జీజీహెచ్‌.. ఇక ఇ–ఆస్పత్రి  

26 Feb, 2022 10:33 IST|Sakshi

రాష్ట్రంలోనే మోడల్‌ ఆస్పత్రిగా ఎంపిక  

పేపర్‌ రహిత సేవలు  

ప్రతి రోగికి ఐడీ

మార్చి 15 నాటికి ‘ఇ’ సేవలు అందుబాటులోకి.. 

లబ్బీపేట(విజయవాడ తూర్పు): విజయవాడ ప్రభుత్వాస్పత్రి ‘ఇ’(ఎల్రక్టానిక్‌) ఆస్పత్రిగా రూపాంతరం చెందనుంది. పేపర్‌ రహిత డిజిటల్‌ వైద్య సేవలందించేందుకు రాష్ట్రంలోనే మోడల్‌ ఆస్పత్రిగా ఎంపికైంది. ఈ విషయాన్ని శుక్రవారం రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు  ఎం.రాఘవేంద్రరావు ప్రకటించారు. ఇ ఆస్పత్రిగా మార్చే పనులు 15 రోజులుగా చేస్తున్నారు. ఈ నెలాఖరుకు అత్యాధునిక పరికరాలు  రానున్నాయి. దీంతో మార్చి 15 నాటికి సేవలు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ డివిజన్‌ హెల్త్‌ మిషన్‌లో భాగంగా ఇ ఆస్పత్రిగా మారుస్తున్నారు.

చదవండి: విశాఖలో సీఎం జగన్‌ పర్యటన.. షెడ్యూల్‌ ఇదే..

ప్రతి రోగికి ఒక శాశ్వత ఐడీ.. 
ప్రభుత్వాస్పత్రికి వచ్చే ప్రతి రోగికి ఆధార్‌ అనుసంధానిత గ్లోబల్‌ బేస్‌డ్‌ ఐడీని క్రియేట్‌ చేస్తారు. ఒకవేళ ఆ రోగికి అప్పుడే ఐడీ ఉంటే, దాని ప్రకారమే సేవలు అందిస్తారు. ఒకసారి ఐడీని క్రియేట్‌ చేస్తే, ఆ నంబరు జీవితాంతం ఉండిపోతుంది. రోగి ఏ ఆస్పత్రికి వెళ్లినా ఐడీ నంబరు చెబితే అతని పూర్వ చికిత్స వివరాలు, దీర్ఘకాలిక వ్యాధులు వంటివి రోగి చెప్పకుండానే తెలుసుకునే అవకాశం ఉంటుంది.  దేశంలోనే కాకుండా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఆ ఐడీ నంబర్‌ పనిచేస్తుంది. ఒకవేళ రోగి ఐడీ నంబర్‌ మర్చిపోయినా, ఆధార్‌ నంబర్‌ ఆధారంగా తెలుసుకునే వీలుంది.

పేపర్‌ రహిత సేవలు.. 
ఎల్రక్టానిక్‌ ఆస్పత్రిగా రూపొంతరం చెందిన అనంతరం ఆస్పత్రిలో పేపర్‌ రహిత వైద్య సేవలు అందించనున్నారు. రోగి ఓపీకి ఐడీ  ఆధారంగా రిజి్రస్టేషన్‌ చేయడంతో పాటు, వైద్యులు పరీక్షలు చేసి, వారు గుర్తించిన లోపాలు, రక్త పరీక్షా ఫలితాలు, సీటీ స్కాన్‌ , ఎంఆర్‌ఐ రిపోర్టులు ఇలా అన్నీ రోగి ఐడీ ఆధారంగా ఆన్‌లైన్‌లోనే ఉంచుతారు.  వారి మెడికల్‌ రికార్డులు సైతం ఆన్‌లైన్‌లోనే ఉంటాయి. ఇన్‌పేషెంట్‌గా చేరినా రికార్డులన్నీ ఎలక్ట్రానిక్‌ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆన్‌లైన్‌లోనే పొందుపరుస్తారు.

ఒక్క క్లిక్‌తో హిస్టరీ అంతా..  
ప్రతి రోగికి ఒక ఐడీని క్రియేట్‌ చేసి, తన రిపోర్టులన్నీ ఆన్‌లైన్‌ చేయడం ద్వారా ఒక్క క్లిక్‌తో రోగి పూర్వ పరిస్థితిని (స్టరీ) వైద్యులు తెలుసుకునే అవకాశం ఉంటుంది.  రోగి ఐడీని ఓపెన్‌ చేస్తే పాత హిస్టరీ అంతా తెలుసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం మోడల్‌ ఆస్పత్రిగా విజయవాడ ప్రభుత్వాస్పత్రిని ఇ ఆస్పత్రిగా మారుస్తుండగా, అనంతరం రాష్ట్రంలోని  ఇతర బోధనాస్పత్రులు, జిల్లా ఏరియా ఆస్పత్రులతో పాటు, ప్రైవేట్‌ ఆస్పత్రులను సైతం మార్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది.

మార్చి 15కి పూర్తి.. 
ఎల్రక్టానిక్‌ ఆస్పత్రిగా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. మార్చి 15 నాటికి పూర్తిస్థాయిలో రూపుదిద్దుకుంటుంది. అందుకోసం ప్రతి వార్డులో ఒక కంప్యూటర్‌ ఆపరేటర్‌ను ఏర్పాటు చేసి, రికార్డులు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ చేస్తాం. ప్రతి రిపోర్టు ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. పేపర్‌ రహిత  వైద్య సేవలు అందించనున్నాం. రోగి హిస్టరీ అంతా ఐడీ నంబర్‌తో తెలుసుకోవచ్చు.
– డాక్టర్‌ యేకుల కిరణ్‌కుమార్, సూపరింటెండెంట్‌  

మరిన్ని వార్తలు