25 శాతం ఉచిత సీట్ల నిబంధనను అమలు చేస్తాం

22 Dec, 2021 05:00 IST|Sakshi

వచ్చే ఏడాది నుంచి విద్యా హక్కు చట్టాన్ని తప్పక అమలు చేస్తాం

అర్హులైన విద్యార్థుల గుర్తింపు ప్రక్రియ జరుగుతోంది

హైకోర్టుకు నివేదించిన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌

సాక్షి, అమరావతి: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి ప్రైవేటు పాఠశాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు 25 శాతం సీట్లను ఉచితంగా కేటా యిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదిం చింది. విద్యాహక్కు చట్టం (ఆర్‌టీఈ) నిబంధన లను తప్పక అమలు చేస్తామని వివరించింది. అర్హు లైన విద్యార్థుల గుర్తింపు జరుగుతోందని తెలిపింది. విద్యా హక్కు చట్టం అమలుకు మూడు నెలల గడువు మంజూరు చేయాలని అభ్యర్థించింది.

ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ అదనపు అఫిడవిట్‌ దాఖలు చేశారు. ప్రతి ప్రైవేటు పాఠశాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరు తూ న్యాయవాది యోగేష్‌ 2017లో హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాస నం తాజాగా మరోసారి విచారణ జరిపింది. ప్రభుత్వ న్యాయవాది కేవీ రఘువీర్‌ స్పందిస్తూ.. విద్యా హక్కు చట్టం అమలుపై తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ రాజశేఖర్‌ దాఖలు చేసిన అదనపు అఫిడవిట్‌ను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సీజే ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

మూడు నెలల గడువునివ్వండి..
విద్యా హక్కు చట్టం అమలు నిమిత్తం రూపొందించిన మార్గదర్శకాల్లో భాగంగా సంబంధిత శాఖలన్నింటితో సమావేశం నిర్వహించామని రాజశేఖర్‌ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 2021–22 విద్యా సంవత్సరంలో ప్రైవేటు పాఠశాలల్లో 1వ తరగతిలో 1,19,550 ప్రవేశాలు జరిగాయన్నారు. ఇందులో విద్యా హక్కు చట్టం ప్రకారం.. 25 శాతం అంటే 29,887 మందికి ఉచిత సీట్లు కేటాయించాల్సి ఉంటుందన్నారు.

ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 24న జీవో 53 జారీ చేసిందని తెలిపారు. ఒకటవ తరగతికి 25 శాతం ఉచిత సీట్ల నిబంధన అమలు చేయడానికి రూ.33 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. అంతేకాకుండా ప్రత్యేక పోర్టల్‌ను రూపొందించాల్సి ఉంటుందని, ఈ పోర్టల్‌ రూపకల్పనకు రెండు మూడు నెలల సమయం పడుతుందని వివరించారు. ఈ విద్యా సంవత్సరానికి ఇప్పటికే ప్రవేశాలు ముగిశాయని, అందువల్ల 25 శాతం ఉచిత సీట్ల నిబంధనను వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామన్నారు.    

మరిన్ని వార్తలు