AP CM YS Jagan: నాపై హత్యాయత్నం కుట్ర కోణంలో క్షుణ్ణంగా దర్యాప్తు జరపలేదు

14 Oct, 2023 04:32 IST|Sakshi

సాక్షి, అమరావతి: తనపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం వెనుక ఉన్న కుట్ర కోణంపై లోతుగా దర్యాప్తు చేసేలా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)ను ఆదేశించాలన్న పిటిషన్‌ను విజయవాడ ఎన్‌ఐఏ కోర్టు కొట్టి వేయటాన్ని సవాల్‌ చేస్తూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు గురువారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా దీనిపై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం లేవనెత్తింది. 

ఈ నేపథ్యంలో రిజిస్ట్రీ అభ్యంతరాలపై విచారణ జరిపే నిమిత్తం ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు వచి్చంది. న్యాయమూర్తి జస్టిస్‌ కొనకంటి శ్రీనివాసరెడ్డి దీనిపై విచారణ జరిపారు. సీఎం జగన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. రిజిస్ట్రీ అభ్యంతరాలకు సంబంధించి నిరంజన్‌రెడ్డి వినిపించిన వాదనలతో న్యాయమూర్తి సంతృప్తి చెందారు. ఈ క్రమంలో ఎన్‌ఐఏ కోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన ఈ పిటిషన్‌కు నెంబర్‌ కేటాయించాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేశారు. 

వైఎస్‌ జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో 2018 అక్టోబర్‌ 25న విశాఖ విమానాశ్రయంలో జనిపల్లి శ్రీనివాసరావు అలియాస్‌ చంటి అనే వ్యక్తి ఆయనపై హత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. నిందితుడు పదునైన కత్తితో వైఎస్‌ జగన్‌ మెడపై దాడికి ప్రయతి్నంచాడు. ఈ ఘటనలో వైఎస్‌ జగన్‌ ఎడమ చేయికి లోతైన గాయమైంది. ఈ ఘటనపై హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు జరిపిన ఎన్‌ఐఏ చార్జిïÙట్‌ దాఖలు చేసింది. వైఎస్‌ జగన్‌ను చంపడమే నిందితుడు శ్రీనివాసరావు ఉద్దేశమని, అందుకే మెడపై కత్తితో దాడికి ప్రయతి్నంచాడని ఎన్‌ఐఏ చార్జిషీట్‌లో పేర్కొంది. దీని వెనుక ఉన్న కుట్ర వ్యవహారాన్ని తదుపరి దర్యాప్తులో తేలుస్తామని ప్రత్యేక కోర్టుకు నివేదించింది. అయితే అటు తరువాత కుట్ర కోణంపై ఎన్‌ఐఏ దృష్టి సారించలేదు. 

ఈ నేపథ్యంలో తనపై హత్యాయత్నం ఘటన వెనుక ఉన్న కుట్రపై లోతైన దర్యాప్తు జరిపేలా ఎన్‌ఐఏను ఆదేశించాలని అభ్యరి్థస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ ఈ ఏడాది ఏప్రిల్‌లో విజయవాడ ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.  ఎన్‌ఐఏ దర్యాప్తులో లోపాలను కోర్టు దృష్టికి తెచ్చారు. కాగా ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు దీన్ని కొట్టివేస్తూ ఈ ఏడాది జూలై 25న తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ సీఎం జగన్‌ తాజాగా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

వ్యాజ్యకాలీన పిటిషన్‌ (ఇంటర్లాక్యుటరీ)పై ఎన్‌ఐఏ కోర్టు ఇచి్చన ఉత్తర్వులపై క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేయవచ్చా? అంటూ రిజిస్ట్రీ అభ్యంతరం తెలిపింది. దీనిపై విచారణ జరిపే నిమిత్తం పిటిషన్‌ శుక్రవారం హైకోర్టులో విచారణకు వచి్చంది. సీఎం జగన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ వ్యాజ్యకాలీన పిటిషన్‌పై క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేయవచ్చని, పలు సుప్రీం కోర్టు తీర్పులను కోర్టుకు నివేదించారు. ఈ కేసులో ఉత్తర్వులు జారీ చేసే పరిధి విజయవాడ ఎన్‌ఐఏ కోర్టుకు లేదన్నారు. 

కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్‌ ప్రకారం ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశి్చమ గోదావరి జిల్లాలు విశాఖ ఎన్‌ఐఏ కోర్టు పరిధిలోకి వస్తాయన్నారు. ఈ నోటిఫికేషన్‌ ప్రకారం ఈ కేసును విచారించే పరిధి విశాఖ ఎన్‌ఐఏ కోర్టుకు మాత్రమే ఉందన్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ కోర్టు ఉత్తర్వులు చెల్లవన్నారు. వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీనివాసరెడ్డి రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చారు.  

మరిన్ని వార్తలు