మహానేత సాయం: ఆ ఉత్తరం విద్యార్థి జీవితాన్ని మార్చేసింది

7 Jul, 2021 15:38 IST|Sakshi

ప్రతిపక్ష నాయకుని హోదాలో విద్యార్థికి సహాయ పడ్డ దివంగత నేత 

నేడు ఎంటెక్‌ పూర్తి చేసి విశాఖ హిందూస్తాన్ షిప్ యార్డ్‌లో డిప్యూటీ మేనేజర్‌గా ఉద్యోగం

సాక్షి, విశాఖపట్పం: ప్రతి మనిషి పుట్టడం కాలం చెల్లించడం ఖాయం. కానీ ఆ మధ్య కాలంలో చేసిన పనులు చిరస్థాయిగా నిలుస్తాయి. మంచి పనులు చేసిన వారు మహానుభావులుగా నిలుస్తారు. ఆ కోవలో దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి చేసిన మేలు ఓ కుటుంబాన్ని సమూలంగా మార్చేసింది. ఇంటర్మీడియట్ చదవడానికి వైఎస్ చేసిన సహాయంతో ఎంటెక్ పూర్తి చేసి ఒక ఉన్నత ఉద్యోగిగా మారిన ఓ యువకుడి పై సాక్షి టీవీ ప్రత్యేక కథనం.

విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రామానికి చెందిన మజ్జి శంకర్రావు, సుజాత దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు శాంతి కుమార్ 2003 గుడిలో పదవ తరగతి 476 మార్కులతో పాసయ్యారు. ఇంటర్‌ చదవడానికి ప్రభుత్వం ఇచ్చే ప్రతిభ పురస్కారం ఐదు వేల రూపాయలు పొందడానికి అవకాశం ఉన్నప్పటికి అతడికి ఆ సాయం లభించలేదు. ఎన్నిసార్లు విద్యాశాఖకు లేఖ రాసిన స్పందన లేదు. ఆ సమయంలో ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డిని కలిసి తమ సమస్య విన్నవించుకున్నారు. వెంటనే వైఎస్సార్‌ ప్రభుత్వానికి లేఖ రాసి ప్రతిభ పురస్కారం అందేలా చేశారు.

ఆ తర్వాత శాంతి కుమార్‌ బాగా చదువుకుని మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదివాడు. ఆ తర్వాత ఎంటెక్‌ పూర్తి చేసి.. విశాఖ హిందూస్తాన్ షిప్ యార్డ్‌లో డిప్యూటీ మేనేజర్‌గా ఎంపికయ్యారు. మహా నేత చేసిన సహాయం వృధా కాకూడదని అందరికీ సహాయపడటమే కాక ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని శాంత కుమార్  విధులు నిర్వహిస్తున్నారు.

మరిన్ని వార్తలు