దేవరపల్లిలో జన జాతర

18 Dec, 2023 05:44 IST|Sakshi
తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి సభలో ప్రసంగిస్తున్న హోంమంత్రి తానేటి వనిత

సామాజిక సాధికార బస్సు యాత్రకు పోటెత్తిన ప్రజానీకం 

అశేషంగా హాజరైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు 

బహిరంగ సభ ఆసాంతం జై జగన్‌.. వన్స్‌మోర్‌ జగన్‌ అంటూ నినాదాలు 

సాక్షి, రాజమహేంద్రవరం/దేవరపల్లి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందించిన సంక్షేమం, చేసిన మేలును వివరించేందుకు తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లిలో ఆదివారం నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతమైంది. దేవరపల్లి, గోపాలపురం, నల్లజర్ల, ద్వారకా తిరుమల మండలాల నుంచి అశేష సంఖ్యలో తరలి వచ్చిన జన ప్రవాహంతో దేవరపల్లి పరిసర ప్రాంతాలు, సభా ప్రాంగణం పోటెత్తాయి.

తొలుత కృష్ణంపాలెం హైవే నుంచి సుమారు 3 వేల ద్విచక్ర వాహనాలతో 6 కిలోమీటర్ల మేర భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు.  ఆరు వేల మందికి పైగా యువత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభిమానులు పాల్గొన్నారు. దేవరపల్లి బస్టాండ్‌ వద్ద డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పూలమాలలు వేసి, అంజలి ఘటించారు. అనంతరం ప్రజలనుద్దేశించి మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రసంగించా­రు. సభ ప్రారంభం నుంచి ముగిసే వరకూ ప్రజలు నేతల ప్రసంగాలు శ్రద్ధగా విన్నారు. సీఎం జగన్‌ తమకు చేసిన మంచిని గుర్తుకు చేసుకుని ‘జై జగన్‌.. 2024 జగన్‌ వన్స్‌మోర్‌’ అంటూ నినదించారు.

 సంఘ సంస్కర్త సీఎం జగన్‌: మంత్రి చెల్లుబోయిన 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఓ సంఘ సంస్కర్త అని రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార శాఖల మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చెప్పారు. నాలుగన్నరేళ్ల పాలనలో అనేక సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లోకి రూ.2.60 లక్షల కోట్లు జమ చేశారని, ఇందులో అధిక శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే చేరా­యని తెలిపారు. పేదలకు అంతర్జాతీయస్థాయి విద్య, వైద్య సౌకర్యాలను చేరువ చేస్తున్నారన్నారు.  సీఎం జగన్‌ చేపట్టిన కార్యక్రమాలతో రాష్ట్రంలోని ప్రతి ఎస్సీ, ప్రతి ఎస్టీ, ప్రతి బీసీ, ప్రతి మైనారిటీ తలెత్తుకొని తిరుగుతున్నారని వివరించారు. 

వృద్ధి రేటు పెంచిన సీఎం జగన్‌: మంత్రి కారుమూరి 
సీఎం జగన్‌ తీసుకొచ్చిన పథకాలతో అన్ని వర్గాల ప్రజలు అభ్యున్నతి సాధిస్తున్నారని మంత్రి కారు­మూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. పేదల ఆరి్థక స్థితిగతులు మార్చారని అన్నారు. దీంతో రాష్ట్ర వృద్ధి రేటు 11.5 శాతానికి పెరిగిందని తెలిపారు. సీఎం జగన్‌ వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. వర్షాలకు తడిసిన ధాన్యం కొని రైతులకు 72 గంటల్లోనే నగదు చెల్లించామన్నారు. 

సామాజిక సాధికారత సాధ్యం చేశారు : మంత్రి తానేటి వనిత 
దశాబ్దాలుగా ప్రజలు ఎదురు చూస్తున్న సామాజిక సాధికారతను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సాధ్యం చేసి చూపించారని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలకు సంక్షేమంలో, పదవుల్లో పెద్ద వాటా ఇచ్చి, వారిని అభివృద్ధి పథంలోకి తెచ్చారని తెలిపారు. పేద విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు సీఎం జగన్‌ ట్యాబ్‌లు ఇస్తున్నారని, వారికి ఉపయోగపడే కంటెంట్‌ మాత్రమే వాటి ద్వారా అందిస్తున్నారని చెప్పారు. దీనిని కూడా కొందరు తప్పుపడుతున్నారని, పెత్తందార్ల పిల్లలు ఇంగ్లిష్‌ మీడియం చదవవచ్చు కానీ, పేద పిల్లలు చదివితే భరించలేరా అని ప్రశ్నించారు. 

సీఎం జగన్‌ పేదలకు భూములిచ్చారు:  ఎంపీ సురేష్‌ 
వైఎస్‌ జగన్‌ అధికారం చేపట్టాక అసైన్డ్, అన్యాక్రాంతమైన భూములను పేదలకు అందించారని బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ అన్నారు. మహిళా సాధికారతకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న నేత జగనేనన్నారు.  

రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి: ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ 
ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ వచ్చిన తర్వాత రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ తెలిపారు. ఈ అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి సీఎం జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. రూ.10 వేల కోట్లు 
వెచ్చిస్తే మూడు రాజధానులు అభివృద్ధి చెందుతాయని అన్నారు. 

నియోజకవర్గంలో రూ.3 వేల కోట్లతో సంక్షేమం, అభివృద్ధి: ఎమ్మెల్యే తలారి 
ఈ నాలుగున్నరేళ్లలో గోపాలపురం నియోజకవర్గంలో సంక్షేమం, అభివృద్ధికి సీఎం జగన్‌ రూ.3 వేల కోట్లు వెచ్చించారని ఎమ్మెల్యే తలారి వెంకట్రావు చెప్పారు. ఇందులో రూ.1,200 కోట్లు కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.  

>
మరిన్ని వార్తలు