శ్రీశైలం క్షేత్రంలో అదొక దర్శనీయ స్థలం.. అక్కడి జలంతో రోగ నివారణ!

7 Oct, 2021 16:12 IST|Sakshi

ఆదిదేవుడి నుంచి అవిర్భవించిన జలధారలు

 నిరంతరం వెలువడే జలధారలు

ఆ జలం రోగాలను నివారిస్తుందని భక్తుల నమ్మకం

సాక్షి, కర్నూలు: శ్రీశైలం మహాక్షేత్రంలోని పేరొందిన దర్శనీయ స్థలాలలో పాలధార–పంచధారలు ఒకటి. శ్రీశైల ప్రధానాలయానికి మూడు కిలోమీటర్ల దూరములో రహాదారిని అనుకొని ఎడమవైపుగల లోయ ప్రాంతమే పాలధార–పంచధార. రోడ్డుమార్గము నుంచి 146మెట్లను దిగి ఈ పాలధార–పంచధారలను చేరుకోవాల్సి ఉంటుంది. 

నిరంతరం వెలువడే జలధారలు:
పాలధార–పంచధారల వద్ద కొండరాళ్ల మధ్య నుంచి ఒక జలధార, మరోకచోట ఐదు జలధారలు ప్రవహిస్తుంటాయి. ఎండా వానలతో సంబంధం లేకుండా నిరంతరం ప్రవహిస్తుండడం ఈ జలధారల విశేషం. క్షణకాల సందర్శనతో క్షణాలను మరిపించే ఈ దివ్యస్థల సందర్శనతో భక్తులు ముగ్దులవుతారు. శ్రీశైల మల్లన్న దర్శనానికి వచ్చిన భక్తులు ఈ పాలధార–పంచధారలను తప్పనిసరిగా సందర్శిస్తుంటారు. 

ఆదిదేవుడి నుంచి అవిర్బావం:
ఆదిదేవుడైన పరమేశ్వరుడి నుంచే ఈ పాలధార–పంచధారలు ఉద్బవించాయని చెప్తుంటారు. పరమశివుని పంచముఖాలైన సద్యోజాత, వామదేవ, అఘెర, తత్పురుష, ఈశాన్య ముఖాల నుంచి ఉద్భవించినవే పంచధారలని చెబుతారు. ఈ జలధారల ప్రవాహతీరులో ఎంతో విశేషం కూడా ఉంది. నిరంతరం వెలువడే ఈ జలధారలు ముందుకు ప్రవహించకుండా అక్కడికక్కడే అంతరించి పోవడం అశ్చర్యాన్ని కలిగిస్తుంది. కాగా ఈ జలధారలు తెల్లగా కనిపించడం వల్ల కొందరు దీన్ని పాలధార–పంచధార అని కూడా పిలుస్తారు. మన ప్రాచీన కావ్యాలు ఈ పాలధార–పంచధారలను పావనతీర్థంగా అభివర్ణించాయి. 

ఆ జలంతో రోగ నివారణ:
ఔషధీ సమ్మిళతమైన పాలధార–పంచధారల నీటికి రోగాన్ని నివారించే శక్తి ఉందనే భావన చాలా ప్రసిద్దంగా ఉంది. ఇప్పటికే కొందరు పాలధార–పంచధార జలాలలను పవిత్ర తీర్థగంగగా భావించి రోగాల నివారణకు వాడుతుంటారు. 

చదవండి: రాయచోటి రాక్‌ గార్డెన్స్‌.. శిలల సొగసు చూడతరమా!

మరిన్ని వార్తలు