ఆదివారం రోజునా అవ్వాతాతల చేతికి రూ.1,415.64 కోట్లు
78.09 శాతం మంది లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ పూర్తి
సాక్షి, అమరావతి: సెలవు రోజైనా ప్రభుత్వం ఠంఛన్గా అవ్వాతాతలకు పింఛన్లు పంపిణీ చేసింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే వలంటీర్లు లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి రాష్ట్రవ్యాప్తంగా 51,37,566 మంది అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగ, ఒంటరి మహిళ, వివిధ రకాల చేతివృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.1,415.64 కోట్ల మొత్తాన్ని అందజేశారు.
అక్టోబరు ఒకటో తేదీ నుంచి పంపిణీకిగాను 65,78,854 మంది లబ్ధిదారుల కోసం ప్రభుత్వం మొత్తం రూ.1,813.60 కోట్ల విడుదల చేసింది. ఒకటో తేదీ ఆదివారం సెలవు అయినా.. సాయంత్రానికి 78.09 శాతం మంది లబ్ధిదారులకు పంపిణీ పూర్తయినట్టు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. మిగిలిన వారి కోసం ఐదోతేదీ వరకు వలంటీర్ల ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ కొనసాగుతుందని తెలిపారు.