ఎయిరిండియాకు ఎయిర్‌ ఏషియా వాటా

8 Nov, 2022 08:56 IST|Sakshi

న్యూఢిల్లీ: బడ్జెట్‌ ధరల విమానయాన సంస్థ ఎయిర్‌ఏషియా ఇండియాలో మిగిలిన వాటాను ప్రయివేట్‌ రంగ దిగ్గజం ఎయిరిండియా సొంతం చేసుకోనుంది. ఇందుకు వాటా విక్రయ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు మలేషియన్‌ కంపెనీ ఎయిర్‌ఏషియా తాజాగా వెల్లడించింది. అయితే ఒప్పందం పూర్తి వివరాలు వెల్లడికాలేదు.

టాటా గ్రూప్, మలేషియన్‌ కంపెనీ భాగస్వామ్యంలో ఏర్పాటైన ఎయిర్‌ఏషియా ఇండియా 2014 జూన్‌లో కార్యకలాపాలు ప్రారంభించింది. టాటా సన్స్‌కు 83.67 శాతం, ఏషియా ఇన్వెస్ట్‌మెంట్‌ లిమిటెడ్‌కు 16.33 శాతం చొప్పున వాటా ఉంది. ఈ ఏడాది జూన్‌లో ఎయిరేషియాలో పూర్తి వాటాను ఎయిరిండియా కొనుగోలు చేసేందుకు సీసీఐ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

కాగా.. జనవరిలో ప్రభుత్వం నుంచి ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లను టాటా గ్రూప్‌ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. తదుపరి ఈ రెండింటితోపాటు.. విస్తారా, ఎయిర్‌ఏషియా ఇండియా బిజినెస్‌లను కన్సాలిడేట్‌(ఏకీకృతం) చేసే సన్నాహాలు ప్రారంభించింది.  

మరిన్ని వార్తలు