గాజాపై నిప్పుల వర్షం.. ఇజ్రాయెల్‌ దాడుల్లో 10 వేల పాలస్తీనియన్ల మృత్యువాత

6 Nov, 2023 19:47 IST|Sakshi

ఇజ్రాయెల్‌ సైన్యం, హమాస్‌ మిలిటెంట్ల మధ్య యద్ధం గత నెల రోజులుగా కొనసాగుతూనే ఉంది. రెండు వర్గాల మధ్య భీకర పోరు రోజురోజుకీ తీవ్ర స్థాయికి చేరుతుంది. హమాస్‌ నెట్‌వర్క్‌ను మట్టుబెట్టడమే లక్ష్యంగా గాజా పట్టీపై ఇజ్రాయెల్‌ సాగిస్తున్న యుద్ధం అమాయక ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటోంది. గాజాపై ఇజ్రాయెల్‌ సైన్యం జరిపిన వైమానిక, బాంబు దాడుల్లో ఇప్పటివరకు మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య తాజాగా 10 వేలకు చేరుకుంది.

గాజాపై ఇజ్రాయెల్‌ మరణహోమంలో 10,022 మంది పాలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు గాజా వైద్యారోగ్యశాఖ సోమవారం ప్రకటించింది. వీరిలో 4,104మంది చిన్నారులు ఉన్నట్లు వెల్లడించింది. అత్యధిక మంది ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల్లో మృతిచెందినట్లు తెలిపింది. అయితే హమాస్‌ మిలిటెంట్లు ప్రయోగించిన  500కుపైగా రాకెట్లు గాజాపై ల్యాండ్‌ అయ్యాయని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. మరోవైపు హమాస్‌ మిలిటెంట్ల దాడుల్లో 1,400 మంది ఇజ్రాయెల్‌ దేశస్తులు మరణించారు.

ఇక గాజా నగరాన్ని చుట్టుముట్టిన ఇజ్రాయెల్‌ దళాలు దానిని రెండుగా విభజించినట్లు ప్రకటించాయి. ఇది ఈ యుద్ధంలో చాలా ముఖ్యమైన దశ అని, తాము మరింత కీలకంగా దాడులు చేయబోతున్నామని పేర్కొంది. ఇదిలా ఉండగా గాజాలోని సాధారణ పాలస్తీనియన్లు తలదాంచుకుంటున్న శరణార్థి శిబిరాలు ఇజ్రాయెల్‌ వైమానిక దాడులతో దద్దరిల్లుతున్నాయి.సెంట్రల్‌ గాజాలో శనివారం అర్ధరాత్రి నుంచి కనీసం మూడు శరణార్థి శిబిరాలపై జరిగిన బాంబు దాడుల్లో 73 మంది సామాన్య ప్రజలు మృత్యువాత పడడం ఆందోళనకు గురిచేస్తోంది. హమాస్‌తో సంబంధం లేని పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్‌ సైన్యం దాడులు చేస్తుండడాన్ని అరబ్‌ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.
చదవండి: యుద్ధంలో కీలక ఘట్టాన్ని చేరాం: ఇజ్రాయెల్

మరిన్ని వార్తలు