బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా టర్న్‌అరౌండ్‌

5 Jun, 2021 01:50 IST|Sakshi

క్యూ4లో రూ. 250 కోట్ల లాభం

తగ్గిన మొండి బకాయిలు

న్యూఢిల్లీ: పీఎస్‌యూ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గతేడాది(2020–21) చివరి క్వార్టర్‌లో టర్న్‌అరౌండ్‌ ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో రూ. 250 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 3,571 కోట్లకుపైగా నికర నష్టాలు ప్రకటించింది. స్టాండెలోన్‌ ఫలితాలివి. అయితే మొత్తం ఆదాయం రూ. 12,216 కోట్ల నుంచి రూ. 11,380 కోట్లకు క్షీణించింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి సైతం లాభాల్లోకి ప్రవేశించింది. రూ. 2,160 కోట్ల స్టాండెలోన్‌ లాభం ఆర్జించింది. 2019–20లో రూ. 2,957 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 49,066 కోట్ల నుంచి రూ. 48,041 కోట్లకు వెనకడుగు వేసింది. క్యూ4లో తాజా స్లిప్పేజెస్‌ రూ. 7,368 కోట్లను తాకగా.. మొత్తం ప్రొవిజన్లు 70 శాతం తక్కువగా రూ. 1,844 కోట్లకు పరిమితమయ్యాయి.

మార్జిన్లు డీలా
మార్చికల్లా బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్థూల మొండి బకాయిలు(ఎన్‌పీఏలు) 14.78 శాతం నుంచి 13.77 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు సైతం 3.88 శాతం నుంచి 3.35 శాతానికి దిగివచ్చినట్లు బ్యాంక్‌ ఎండీ, సీఈవో ఏకే దాస్‌ పేర్కొన్నారు. ఈ ఏడాది స్థూల ఎన్‌పీఏలను 2.5 శాతంవరకూ తగ్గించుకోనున్నట్లు చెప్పారు. అయితే దేశీయంగా నికర వడ్డీ మార్జిన్లు 3.18 శాతం నుంచి 2.16 శాతానికి నీరసించాయి. ఈ ఏడాది మార్జిన్లను 2.5 శాతానికి మెరుగుపరచుకోనున్నట్లు దాస్‌ తెలియజేశారు. కనీస మూలధన పెట్టుబడుల నిష్పత్తి(సీఏఆర్‌) 13.1 శాతం నుంచి 14.93 శాతానికి బలపడింది.  

ఫలితాల నేపథ్యంలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేరు ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 3 శాతం జంప్‌చేసి రూ. 82.3 వద్ద ముగిసింది. ఈ కౌంటర్లో రెండు ఎక్సే్చంజీలలోనూ కలిపి దాదాపు 5 కోట్ల షేర్లు చేతులు మారడం గమనార్హం!

మరిన్ని వార్తలు