మాట్లాడే ఏటిఎమ్ లు వచ్చేస్తున్నాయి

1 Feb, 2021 20:15 IST|Sakshi

కొత్త సాంకేతికతలో తక్కువ జాప్యం

5జీతో అవకతవకలకు అడ్డుకట్ట

హైదరాబాద్: ఇప్పటి వరకు మనం సాధారణంగా నగదు ఉపసంహరించుకోవడం కోసం లేదా బ్యాంకు బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం కోసం ఏటిఎమ్‌ దగ్గరికి వెళ్లి ఉంటాం. కానీ అదే వర్చువల్ బ్యాంక్ మేనేజర్‌తో మాట్లాడటం లేదా మీ కెవైసిని పూర్తి చేయడం కోసం ఏటిఎమ్ దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇది సాధ్యం కాదు అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ సైన్స్ ఫిక్షన్ ని నిజం చేయబోతుంది హైదరాబాద్ కు చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ & రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ (ఐడిఆర్‌బిటి) సంస్థ.(చదవండి: వాట్సాప్‌లో కొత్త రకం మాల్‌వేర్!)

ఆసక్తికర విషయం ఏమిటంటే, కొద్దీ రోజుల క్రితం ప్రముఖ టెలికాం ఆపరేటర్ భారతి ఎయిర్‌టెల్ హైదరాబాద్ నగరంలో ఒక ప్రైవేట్ నెట్‌వర్క్ సహాయంతో 5జీ సేవలను పరీక్షించి చూసారు. 5జీ కనెక్షన్‌తో 1జీబీ ఫైల్ డౌన్‌లోడ్ చేయడానికి 30 సెకన్ల మాత్రమే పట్టింది. "రాబోయే సరికొత్త టెక్నాలజీ 5జీ సహాయంతో ఎటిఎంలు ఒక బ్యాంక్ బ్రాంచ్‌గా పనిచేస్తాయి.. అలాగే ఎటిఎంలు 5జీ నెట్‌వర్క్‌లకు రిలేయింగ్ పాయింట్లుగా మారవచ్చ" అని ఐడిఆర్‌బిటి మాజీ డైరెక్టర్ ఎ.ఎస్.రామశాస్త్రి అన్నారు. ఇతని నాయకత్వంలోనే ఈ టెక్నాలజీపై ప్రయోగాలు మొదలయ్యాయి. 

2022లో మాట్లాడే ఎటిఎంలు
2జీ, 3జీ లేదా 4జీ విషయానికి వస్తే భారతదేశం ఇతర దేశాలతో చాలా వెనుకబడి ఉండేది. కానీ ఇప్పుడు 5జీ టెక్నాలజీ విషయానికి వచ్చేసరికి ఇతరదేశాలతో పోటీ పడే స్థాయికి ఎదిగింది అని ఎ.ఎస్.రామశాస్త్రి అన్నారు. ఆర్బిఐ బ్యాంకింగ్, ఆర్థిక సేవల కోసం దేశంలో 5జీ సాంకేతికతను ఉపయోగించడం కోసం ప్రభుత్వం సెప్టెంబర్ 2020లో ఒక ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగం ఈ సాంకేతికతకు ముందుగానే సిద్ధంగా ఉండాలని పరిశోధకులు, బ్యాంకర్లతో సహా 10 నుండి 12 మంది వ్యక్తుల బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 

ఈ బృందం 5జీ టెక్నాలజీ ద్వారా బ్యాంకింగ్, ఆర్థిక రంగంలో రాబోయే మార్పులను ముందుగానే గ్రహించి దానికి తగ్గట్లుగా ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి సారించింది. ఇందులో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించి దీనిని 2022 నాటికీ మార్కెట్ లో ప్రదర్శించాలని చూస్తున్నారు. ఈ 5జీ టెక్నాలజీ వల్ల ఆర్థిక రంగంలో చాలా మార్పులు సంభవిస్తాయని రామశాస్త్రి పేర్కొన్నారు. “గ్రామీణ ప్రాంతాల్లో, అధిక బ్యాండ్‌విడ్త్ లభించడం వల్ల వారు కూడా డిజిటల్ చెల్లింపుల వైపు మొగ్గుచూపుతారు. లావాదేవీల కూడా ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేయబడతాయి. కానీ వారు 5జీ టెక్నాలజీ ఉన్న గాడ్జెట్లు కొనగలరా లేదా బ్యాంకింగ్ ఉద్యోగులు వారి దగ్గరికి చేరువ చెయ్యాలా అని ఆలోచిస్తున్నామని" రామశాస్త్రి అన్నారు.(చదవండి: జియోపై ఎయిర్‌టెల్ పైచేయి)

5జీతో అవకతవకలకు అడ్డుకట్ట
కొత్త సాంకేతికతలో తక్కువ జాప్యం, అధిక వేగం కారణంగా మొత్తం బ్యాంకింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుందని వీరు భావిస్తున్నారు. 5జీతో పోలిస్తే 4జీలో ఉన్న 50 మిల్లీసెకన్ల కనీస జాప్యాన్ని ఒక మిల్లీ సెకన్లకు తగ్గించవచ్చు. డేటా వేగం 4జీ కన్నా 10 నుంచి 20రేట్లు వేగంగా ఉంటుంది. లావాదేవీల సమయంలో అంతరాన్ని మెరుగుపరచడం ద్వారా బ్యాంకింగ్ రంగం ఆర్ధిక పరిధిని మెరుగుపరచడంతో పాటు 5జీ బ్యాంకింగ్ కార్యకలాపాలను మరింత సురక్షితంగా చేస్తుంది. ఎందుకంటే సమయం ప్రాతిపదికన అవకతవకలు జరుగుతాయి. ప్రధానంగా స్టాక్ మార్కెట్ విషయంలో ఈ అవకతవకలు తగ్గించవచ్చు. 5జి టెక్నాలజీపై ఐడిఆర్‌బిటి విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం.. 5జీ నెట్‌వర్క్ మిలియన్ల ఐవోటి పరికరాలను ఆపరేట్ చేయగలదు, అధిక డేటా వేగం కారణంగా మెషిన్-టు-మెషిన్(M2M) మధ్య కమ్యూనికేషన్‌ కూడా ప్రారంభించగలదు.  ఇది ప్రస్తుత వ్యవస్థలను మరింత 'తెలివైనదిగా' చేయనుంది.  

కెపిఎంజి ఇండియా భాగస్వామి, డిజిటల్ కన్సల్టింగ్ హెడ్ అఖిలేష్ తుటేజా 5జీ టెక్నాలజీ సామర్థ్యాన్ని వివరించారు. ఐఒటి వాడకం, టచ్ లెస్ కారణంగా బ్యాంకింగ్‌లో చాలా మార్పులను చోటుచేసుకుంటాయి. 5జీ టెక్నాలజీ ఎటిఎంలు, బ్యాంక్ శాఖలు, పిఒఎస్‌లను ప్రభావితం చేయనున్నట్లు తెలిపారు. 2025 నాటికి 5జి టెక్నాలజీ ఆధారంగా పనిచేసే గాడ్జెట్లు ఎక్కువ సంఖ్యలో రాబోతున్నాయి అని ఆయన అన్నారు. కోవిడ్ -19, డీమోనిటైజేషన్ కారణంగా మొబైల్ బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపులు విపరీతంగా పెరిగినట్లు పేర్కొన్నారు. అన్నిటికంటే ముందు ఆర్థిక సేవ రంగంలో కస్టమర్ ఆన్‌బోర్డింగ్‌ ప్రక్రియ చాలా కీలకమైనదిగా పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు