ఆకాశ ఎయిర్‌కు బాంబు బెదిరింపు..185 మంది ప్రయాణికులు!

21 Oct, 2023 21:09 IST|Sakshi

బ్యాగ్‌లో బాంబు ఉందని బెదిరించడంతో శనివారం ఆకాశ ఎయిర్‌ విమానాన్ని అత్యవసరంగా ముంబయికి మళ్లించారు. పుణె నుంచి దిల్లీకి బయలుదేరిన ఆకాశ ఎయిర్ విమానాన్ని ఓ ప్రయాణికుడు తన బ్యాగ్‌లో బాంబు ఉందని చెప్పడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం టేకాఫ్ అయిన 40 నిమిషాల తర్వాత సదరు ప్రయాణికుడు సిబ్బందితో బెదిరింపులకు పాల్పడ్డాడు. అప్పుడు విమానంలో 185 మంది ప్రయాణికులు ఉన్నారు.

సిబ్బంది వెంటనే కెప్టెన్‌కు సమాచారం అందించారు. అత్యవసరంగా ముంబైలో విమానాన్ని ల్యాండ్ చేయాలని నిర్ణయించుకున్నారు. దాంతో ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. బాంబు డిటెక్షన్, డిస్పోజల్ స్క్వాడ్‌ ద్వారా ప్రయాణీకుల బ్యాగ్‌లు పరిశీలించారు. విమానాశ్రయంలో దిగాక జరిపిన తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు కన్పించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బాంబు బెదిరింపు బూటకమని తేలడంతో, విమానం తిరిగి ఢిల్లీకి బయలుదేరింది. ఘటనకు మందు సదరు ప్రయాణికుడు ఛాతీ సమస్యకు మెడిసిన్‌ తీసుకున్నట్లు తన కుటుంబ సభ్యులు అన్నారని సీఐఎస్‌ఎఫ్‌ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు