గ్రామీణంలో పుంజుకున్న ఎఫ్‌ఎంసీజీ వినియోగం

11 May, 2023 07:11 IST|Sakshi

ఆరు త్రైమాసికాల తర్వాత స్వల్ప వృద్ధి

పట్టణాల్లో మెరుగైన అమ్మకాలు

న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల వినియోగం తిరిగి గాడిన పడింది. ఆరు త్రైమాసికాల క్షీణత తర్వాత మార్చి క్వార్టర్‌లో వృద్ధి నమోదైంది. డేటా విశ్లేషణ సంస్థ ‘ఎన్‌ఐక్యూ’ ఈ వివరాలను విడుదల చేసింది. ఎఫ్‌ఎంసీజీ విక్రయాల్లో గ్రామీణ ప్రాంతాల వాటా 35%గా ఉంటుందని పేర్కొంది. 

అయితే ఆరు త్రైమాసికాల తర్వాత అమ్మకాల్లో భారీ వృద్ధి నమోదు కాలేదు. అతి స్వల్పంగా 0.3 శాతమే పెరిగాయి. కాకపోతే దీన్ని సానుకూలంగా ఐక్యూ నివేదిక పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో మార్చి త్రైమాసికంలో ఎఫ్‌ఎంసీజీ అమ్మకాలు 5.3%పెరిగినట్టు వెల్లడించింది. దీనికంటే ముందు గ్రామీణ మార్కెట్‌ చివరిగా 2021 ఏప్రిల్‌–డిసెంబర్‌ కాలంలో వృద్ధిని చూడడా న్ని ఈ నివేదిక ప్రస్తావించింది. మొత్తం మీద మార్చి త్రైమాసికంలో ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమలో అమ్మకాల పరంగా 3.1%, విలువ పరంగా 10.1% వృద్ధి నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం పుంజుకోవడానికి తోడు, సంప్రదాయ అమ్మకాలు పెరగడం సానుకూల వృద్ధికి దోహదపడింది. 

ఆహారోత్పత్తులకే ఆదరణ..  
ఆహారోత్పత్తుల అమ్మకాలు 4.3 శాతం వృద్ధి     చెందాయి. ఆహారేతర వినియోగం కేవలం 0.2 శాతం పెరిగింది. ఆహారం కాకుండా, గృహ సంరక్షణ ఉత్పత్తుల కొనుగోళ్లలో వినియోగదారులు ఆచితూచి ఖర్చు చేస్తున్నారు. సంప్రదాయ కిరాణా దుకా ణాల్లో అమ్మకాలు కేవలం 1.9 శాతమే పెరగ్గా, ఆధునిక అంగళ్లు అయిన హైపర్‌ మార్కెట్లు, షాపింగ్‌ మాల్స్‌లో ఎఫ్‌ఎంసీజీ అమ్మకాలు 14.6 శాతం వృద్ధిని చూశాయి. 

వీధి చివర్లో ఉండే కిరాణా దుకాణాల్లో ఎలాంటి డిస్కౌంట్లు ఉండకపోగా, పెద్ద షాపింగ్‌ మాల్స్‌ మంచి ఆఫర్లతో తక్కువ మార్జిన్‌తో విక్రయిస్తుండడం ఈ పరిణామాలకు నిదర్శనం. ఎఫ్‌ఎంసీజీలో చిన్న కంపెనీఈలు అమ్మకాల పరంగా 7.2 శాతం వృద్ధిని చూస్తే, పెద్ద కంపెనీలకు ఇది 3.2 శాతంగానే ఉంది. ఇక్కడ కూడా అంతే, చిన్న ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు తక్కువ మార్జిన్లతో తక్కువ ధరలకు విక్రయిస్తుండడం వినియోగదారులను ఆకర్షిస్తోంది. 

మరిన్ని వార్తలు