భోజన సమయంలో కింద కూర్చుంటే రూ.220 జరిమానా..!

7 Dec, 2023 12:14 IST|Sakshi

చైనాలోని ప్రజల జీనవ ప్రమాణాలు మెరుగుపరిచేందుకు నిత్యం కొత్త విధానాలను రూపొందించి అమలు చేస్తుంటారు. తాజాగా చైనాలోని ఓ కౌంటీలో అధికారులు తీసుకొచ్చిన నిబంధనపై అక్కడి సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది.

సిచువాన్‌ ప్రావిన్స్‌లోని పుగే కౌంటీలో ఇంటి పరిశుభ్రతను నిర్లక్ష్యం చేసిన వారికి జరిమానా విధిస్తామని అధికారులు ప్రకటించినట్లు సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌(ఎస్‌సీఎంపీ) మీడియా సంస్థ తెలిపింది. ఈ నిబంధనల ప్రకారం కౌంటీలోని ప్రజలు తమ ఇళ్లను, వంట పాత్రలను శుభ్రం చేయకుంటే 1.4 డాలర్లు(రూ.120), భోజన సమయంలో కింద కూర్చుంటే 2.8(రూ.220) డాలర్లు జరిమానా విధించనున్నారు.

ఈ జరిమానా కేటగిరీలను 14 భాగాలుగా విభజించారు. అధికారులు తనిఖీల కోసం వచ్చిన సమయంలో ఇంట్లో సాలె పురుగులు, ఇతరత్రా కీటకాలు, దుమ్ముధూళి ఉంటే మొదటిసారి మూడు నుంచి పది యువాన్లు జరిమానా విధించనున్నారు. రెండోసారి తనిఖీల్లో కూడా ఆ ఇంట శుభ్రత లేకుంటే జరిమానా మొత్తాన్ని రెట్టింపు చేస్తారని ఎస్‌సీఎంపీ కథనంలో వెల్లడించింది. ఈ నిబంధనపై కౌంటీ వైస్‌ డైరెక్టర్‌ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. అపరిశుభ్రతను తగ్గించి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే దీని లక్ష్యమని తెలిపారు.

ఇదీ చదవండి: నెలకు రూ.400 కోట్ల రుణాలిచ్చే కంపెనీ.. మూసివేస్తున్నట్లు షాకింగ్‌ కామెంట్లు..

‘కౌంటీలో కొందరి ఇళ్లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఇల్లంతా బూజుతో అపరిశుభ్ర వాతావరణంలో ప్రజలు జీవిస్తున్నారు. వారు భోజనం చేస్తున్న ప్రదేశంలోనే కుక్కలు, దోమలు తిరుగుతున్నాయి. ఈ సమస్యను జరిమానాలు పరిష్కరించలేవు. కానీ, ప్రజలు తమ ఇళ్లను పరిశుభ్రంగా ఉంచేందుకు మాత్రం ఈ నిబంధనలు దోహదపడతాయని భావిస్తున్నాం’ అని వైస్‌ డైరెక్టర్ తెలిపారు.

>
మరిన్ని వార్తలు