చైనా వద్దు భారత్ ముద్దు.. ఇండియాపై పడ్డ అమెరికన్ కంపెనీ చూపు..

3 Dec, 2023 16:01 IST|Sakshi

అగ్రరాజ్యం అమెరికాలో అతిపెద్ద రిటైల్ స్టోర్స్ చైన్ కలిగి ఉన్న 'వాల్‌మార్ట్' (Walmart) గత కొంత కాలంగా భారతీయ మార్కెట్ మీద దృష్టి సారిస్తోంది. ఇప్పటికే సుమారు నాలుగింట ఒక వంతు దిగుమతులను ఇండియా నుంచి స్వీకరిస్తున్న కంపెనీ, చైనా దిగుమతులను తగ్గించడానికి అన్ని విధాలా తయారవుతోంది.

నిజానికి వాల్‌మార్ట్‌కు అతి పెద్ద దిగుమతిదారుగా ఉన్న చైనా నుంచి కంపెనీ దిగుమతులను ప్రతి ఏటా తగ్గిస్తూనే ఉంది. 2018లో 80 శాతం దిగుమతులు చేసుకున్న సంస్థ.. 2023 నాటికి 60 శాతం మాత్రమే దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఏ ఒక్క సరఫరాదారు ఒక దేశం మీద ఆధారపడి పనిచేసే అవకాశం లేదు, భారత ఆర్థిక దృక్పథం, సానుకూల మార్కెట్ సూచికలు, తక్కువ ధర తయారీ సామర్థ్యాలు వాల్‌మార్ట్‌ను ఆకర్శించింది. గతంలో చైనా నుంచి ఎక్కువ దిగుమతులు చేసుకున్న కంపెనీ చైనా దిగుమతులను తగ్గించి భారతదేశం నుంచి దిగుమతులు చేసుకోవడానికి సుముఖత చూపింది. ఇందులో భాగంగానే ఇ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో 77% వాటాను కొనుగోలు చేసింది. 

ఇదీ చదవండి: రతన్ టాటా మేనేజర్ కొత్త కారు ఇదే.. చూసారా!

2027 నాటికి మన దేశం నుంచి మొత్తం 10 బిలియన్ డాలర్స్ విలువైన వస్తువులను కంపెనీ దిగుమతి చేసుకునే అవకాశం ఉందని వాల్‌మార్ట్ సోర్సింగ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రియా ఆల్బ్రైట్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఇండియా నుంచి వాల్‌మార్ట్ దిగుమతులు ఏడాదికి 3 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంతే కాకుండా కంపెనీ భారత ప్రభుత్వంతో మంచి రిలేషన్ పెంచుకుంటూ.. దేశంలో పెట్టుబడులు పెట్టడానికి కూడా సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు