చైనా ఈవీ స్టార్టప్‌ దివాలా

12 Oct, 2023 02:15 IST|Sakshi

సమస్యల్లో డబ్ల్యూఎం మోటార్స్‌

షాంఘై: తాజాగా చైనాకు చెందిన ఎలక్ట్రిక్‌ వాహన (ఈవీ) వర్ధమాన కంపెనీ డబ్ల్యూఎం మోటార్స్‌ దివాలా ప్రకటించింది. సబ్సిడీలలో కోత, అందుబాటు ధరలకు ప్రాధాన్యతగల మార్కెట్‌ నేపథ్యంలో ఈవీ స్టార్టప్‌.. పలు సవాళ్లను ఎదుర్కొంది. వెరసి కార్యకలాపాలను కొనసాగించడంలో విఫలమైంది. నిజానికి ఈవీ అమ్మకాలలో చైనా ప్రపంచంలోనే నాయకత్వ స్థాయిలో ఉంది. కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ వివరాల ప్రకారం అంతర్జాతీయ అమ్మకాలలో(2023 తొలి క్వార్టర్‌) 56 శాతం వాటాను ఆక్రమిస్తోంది. ఈ కాలంలో ఈవీ అమ్మకాలు వార్షికంగా 32 శాతం ఎగశాయి. వీటిలో బ్యాటరీ ఈవీల వాటా 73 శాతంగా నమోదైంది. మిగిలిన 27 శాతం వాటాను ప్లగిన్‌ హైబ్రిడ్‌ ఈవీలు అందిపుచ్చుకున్నాయి.  

కంపెనీ ఎదిగిన తీరిలా
డబ్ల్యూఎం మోటార్స్‌ను 2015లో ఫ్రీమ్యాన్‌ షేన్‌ ఏర్పాటు చేశారు. తొలి దశలో టెక్‌ దిగ్గజాలు బైడు, టెన్సెంట్, పీసీసీడబ్ల్యూ(హాంకాంగ్‌), హాంగ్షాన్, షున్‌ టక్‌ హోల్డింగ్స్‌ తదితరాలు పెట్టుబడులు అందించాయి. ఇతర ప్రత్యర్ధి సంస్థల బాటలోనే చైనీస్‌ క్లిష్టతరహా బ్యాటరీ సప్లై చైన్‌ ఎకోసిస్టమ్‌ ఆధిపత్యం ద్వారా కంపెనీ లబ్ది పొందింది. అయితే, ప్రత్యర్ధి సంస్థల నుంచి తీవ్రపోటీ, ముడివ్యయాల పెరుగుదల, సబ్సిడీలలో కోత, అమ్మకాలు పడిపోవడం వంటి అంశాలు రెండేళ్లుగా కంపెనీకి సవాళ్లు విసురుతున్నాయి. దీంతో 2021కల్లా వార్షిక నష్టం రెట్టింపై 1.13 బిలియన్‌ డాలర్లను తాకింది.

మరిన్ని వార్తలు