సామాన్యుడికి 'ధరా' ఘాతం, కట్టడి చేయాలని నిర్మలా సీతారామన్‌ పిలుపు!

13 Jul, 2022 06:47 IST|Sakshi

రిటైల్‌ ద్రవ్యోల్బణం 

జూన్‌లో 7.01 శాతం

కాస్త తగ్గినా... 

ఆందోళనకర స్థాయిలోనే 

న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ద్వైమాసిక పరపతి విధాన సమీక్షకు ప్రాతిపదిక అయిన రిటైల్‌ ద్రవ్యోల్బణం జూన్‌లో 7.01 శాతంగా నమోదయ్యింది. అంటే 2021 జూన్‌ నెలతో పోల్చితే ఈ వస్తువుల బాస్కెట్‌ 7.01 శాతం పెరిగిందన్నమాట. అయితే మే నెలతో (7.04 శాతం) పోల్చితే స్వల్పంగా తగ్గింది.  

ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న ప్రకారం 2 నుంచి 6 శాతం మధ్య రిటైల్‌ ద్రవ్యోల్బణం ఉండాలి. అయితే ఈ స్థాయికి మించి రిటైల్‌ ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇది వరుసగా ఆరవనెల. తీవ్ర ద్రవ్యోల్బణం నేపథ్యంలో  మే, జూన్‌ నెలల్లో  ఆర్‌బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను రెండు దఫాలుగా 0.90 బేసిస్‌ పాయింట్లు (0.4 శాతం, 0.5 శాతం)  పెంచింది. దీనితో ఈ రేటు 4.9 శాతానికి చేరిన సంగతి తెలిసిందే. కాగా, ద్రవ్యోల్బణం స్పీడ్‌ను నియంత్రించాల్సిన తక్షణ అవసరం ఉందని ఒక ప్రకటనలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. వస్తువుల వారీగా ఈ కట్టడి జరగాలని ఆమె అన్నారు.  

ధరల తీరిది... 
ఇక మేతో పోల్చితే ఫుడ్‌ బాస్కెట్‌లో ధరల స్పీడ్‌ 7.97 శాతం నుంచి జూన్‌లో 7.75 శాతానికి స్వల్పంగా తగ్గింది. మేలో 18.26 శాతం ఉన్న కూరగాయల ధరాఘాతం జూన్‌లో 17.37 శాతానికి దిగివచ్చింది.  పప్పులు సంబంధిత ప్రొడక్టుల ధర మరింతగా 1.02 శాతం తగ్గింది. మేతో తగ్గుదల 0.42 శాతం.  పండ్ల ధరలు 2.33 శాతం నుంచి 3.10 శాతానికి చేరాయి. ఇంధనం, విద్యుత్‌ కేటగిరీలో మాత్రం ధరల స్పీడ్‌ 9.54 శాతం నుంచి 10.39 శాతానికి చేరింది.

మరిన్ని వార్తలు