లావాదేవీలపై టీడీఎస్‌ను తగ్గించండి

11 May, 2022 06:09 IST|Sakshi

ప్రభుత్వానికి క్రిప్టో పరిశ్రమ విజ్ఞప్తి

న్యూఢిల్లీ: క్రిప్టోకరెన్సీలలో ట్రేడింగ్‌ చేయడం వల్ల వచ్చే లాభాలపై చెల్లింపులకు సంబంధించి టీడీఎస్‌ను ప్రతిపాదిత 1 శాతం నుండి 0.01 లేదా 0.05 శాతానికి తగ్గించాలని క్రిప్టో పరిశ్రమ ప్రభుత్వాన్ని కోరింది. ఒక టీడీఎస్‌ రిటైల్‌ వ్యాపారుల ప్రయోజనాలకు విఘాతమని పేర్కొంది. ఇక క్రిప్టోకరెన్సీల ద్వారా వచ్చే ఆదాయంపై 30 శాతం పన్ను చాలా ఎక్కువని,  ఈ పన్ను రేటును తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని కాయిన్‌ డీసీఎక్స్‌ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు సుమిత్‌ గుప్తా పేర్కొన్నారు. కొత్త పన్ను నిబంధనలు, వాటి అమలు విషయంలో తన ప్లాట్‌ఫారమ్‌లోని వ్యాపారులతో కాయిన్‌ డీసీఎక్స్‌ సంప్రదింపులు జరుపుతోందని కూడా ఆయన చెప్పారు. క్రిప్టో అసెట్స్‌పై ఆదాయపు పన్నుకు సంబంధించి 2022–23 బడ్జెట్‌ స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో తాజా పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.

గుర్రపు పందెం లేదా ఇతర స్పెకిలేటివ్‌ లావాదేవీల నుండి గెలుపొందిన మొత్తాలపై ఏప్రిల్‌ 1 నుండి 30 శాతం ఆదాయపు పన్ను, సెస్, సర్‌చార్జీలు విధించనున్న సంగతి తెలిసిందే. వార్షికంగా రూ. 10,000 దాటిన వర్చువల్‌ కరెన్సీల చెల్లింపులపై, అంతే పరిమాణానికి సంబంధించి బహుమతులపై 1 శాతం టీడీఎస్‌ విధించాలని బడ్జెట్‌ 2022–23 ప్రతిపాదించింది.  ఆదాయపు చట్టం ప్రకారం ఖాతాలను ఆడిట్‌  చేయాల్సిన నిర్దిష్ట వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లకు టీడీఎస్‌ పరిమితి సంవత్సరానికి రూ. 50,000గా ఉంది. 1 శాతం టీడీఎస్‌కు సంబంధించిన నిబంధనలు 2022 జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి.

మరిన్ని వార్తలు