ముంబై: స్టాక్ మార్కెట్ రెండో రోజు కూడా నష్టాలతోనే ముగిసింది. బ్లూ చిప్ కంపెనీ ఇన్వెస్టర్లు లాభాలు తీసుకునేందుకు ఆసక్తి చూపించడంతో దేశీ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా నష్టపోయాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మకాలే ఎక్కువగా జరిగాయి. ఆటోమొబైల్ పరిశ్రమకు చెందిన షేర్లు లాభాలు పొందడంతో మార్కెట్కి కొంత ఊరట లభించింది.
బీఎస్ఈ సెన్సెక్స్ ఈ రోజు ఉదయం 60,755 పాయింట్ల దగ్గర ఓపెన్ అయ్యింది. కొద్ది సేపు మాత్రమే పైకి ఏగబాకి 60,802 పాయింట్లను టచ్ చేసింది. ఆ తర్వాత వరుసగా పాయింట్లు కోల్పోయింది. మధ్యాహ్నం సమయంలో కద్ది కోలుకున్నట్టు కనిపించినా మరోసారి ఇన్వెస్టర్లు అమ్మకాలు మొదలుపెట్టడంతో నష్టాలు తప్పలేదు. మార్కెట్ ముగిస సమయానికి సెన్సెక్స్ 396 పాయింట్లు నష్టపోయి 60,322 పాయింట్ల దగ్గర ట్రేడవుతుండగా నిఫ్టీ 110 పాయింట్లు నష్టపోయి 17,999 దగ్గర క్లోజయ్యింది. బీఎస్ఈ 60వేల పాయింట్లను కష్టంగా నిలుపుకోగా నిఫ్టీ తృటిలో 18 వేల పాయింట్లను కోల్పోయింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆల్ట్రాటెక్ సిమెంట్, మారుతి సుజూకి కంపెనీ షేర్లు లాభాలు పొందగా రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ , హెచ్డీఎఫ్సీ షేర్లు భారీగా నష్టపోయాయి.