Diageo New CEO: ప్రపంచంలో అతిపెద్ద లిక్కర్ సామ్రాజ్యం.. ఇకపై మహిళ సారథ్యంలో

30 Mar, 2023 18:12 IST|Sakshi

ప్రపంచంలోని అతిపెద్ద స్పిరిట్స్ తయారీదారు డియాజియో (Diageo) కంపెనీకి త్వరలో ఒక మహిళ నాయకత్వం వహించనుంది. ఈమె పేరు 'డెబ్రా క్రూ'. ఏప్రిల్ 01 నుంచి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పదవి నుంచి CEOగా పదోన్నతి కల్పించనున్నట్లు కంపెనీ తెలిపింది.

జానీ వాకర్ స్కాచ్ విస్కీ, గిన్నిస్, బెయిలీస్‌ వంటి ప్రముఖ బ్రాండ్‌లను తయారు చేసే కంపెనీకి సర్ ఇవాన్ మెనెజెస్ గత పది సంవత్సరాల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా స్థానంలో కొనసాగారు. అయితే ఈ పదవికి త్వరలోనే ఒక కొత్త బాస్ రాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా డియాజియో 28,000 కంటే ఎక్కువమంది ఉద్యోగులను కలిగి ఉన్నట్లు సమాచారం.

డియాజియో కంపెనీ 180 కంటే ఎక్కువ మార్కెట్‌లలో 200 కంటే ఎక్కువ బ్రాండ్‌లను విక్రయిస్తోంది. ఇందులో స్కాచ్, కెనడియన్ విస్కీ, వోడ్కా, జిన్, రమ్, లిక్కర్స్ వంటివి ఉన్నాయి. మొత్తం మీద అమ్మకాల పరంగా ఇది అతి పెద్ద కంపెనీ అని తెలుస్తోంది. ఇప్పటి వరకు UKలోని టాప్ 100 లిస్టెడ్ కంపెనీలలో ఎనిమిది మంది మాత్రమే మహిళా సీఈఓలు ఉన్నారు. ఈ జాబితాలో ఇప్పుడు డెబ్రా క్రూ కూడా చేరనుంది.

(ఇదీ చదవండి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి అకౌంట్‌లోకి డబ్బులు)

1970 డిసెంబర్ 20న జన్మించిన 'క్రూ' కొలరాడో యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ & చికాగో విశ్వవిద్యాలయం బూత్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి MBA పూర్తి చేసి.. పెప్సీ, క్రాఫ్ట్ ఫుడ్స్, నెస్లే, మార్స్ వంటి సంస్థల్లో పనిచేసింది. ఆ తరువాత పొగాకు సంస్థ రేనాల్డ్స్ అమెరికన్‌కు నాయకత్వం వహించింది.

2019లో డియాజియో కంపెనీలో అడుగుపెట్టిన డెబ్రా క్రూ 2022 అక్టోబర్‌లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌ స్థానం పొందింది. ఆ తరువాత 2020లో డియాజియో అతిపెద్ద మార్కెట్ అయిన ఉత్తర అమెరికా వ్యాపారానికి నాయకత్వం వహించింది. కాగా ఇప్పుడు ఆ కంపెనీకి త్వరలోనే సీఈఓ పగ్గాలను చేతపట్టనుంది.

మరిన్ని వార్తలు