Disney CWC 2023 Live Viewership: ప్రపంచకప్‌ క్రికెట్‌ను ఎంతమంది చూశారంటే..

23 Nov, 2023 17:43 IST|Sakshi

భారతదేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ చాలాఎక్కువ. గల్లీలో క్రికెట్‌ ఆడే చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఇండియా ‍మ్యాచ్‌ వస్తుందంటే టీవీలకు అతుక్కుపోతారు. అదీ ఫైనల్‌ మ్యాచ్‌ అంటే మరీ ఎక్కువ. అందులోనూ వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌ అంటే చెప్పనక్కర్లేదు. ఇటీవల ఉత్కంఠభరితంగా జరిగిన తుదిపోరులో భారత ఆటగాళ్లు పరాజయం పొందిన విషయం తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు రికార్డుస్థాయిలో ఈసారి వరల్డ్‌కప్‌ టోర్నమెంట్‌ను వీక్షించినట్లు తెలిసింది. ఏకంగా 51.8 కోట్ల మంది భారతీయులు ఇటీవల జరిగిన ప్రపంచకప్‌ టోర్నమెంట​్‌ను తిలకించినట్లు డిస్నీ సంస్థ తెలిపింది. 

ఐసీసీ ఆధ్యర్యంలో 48 రోజుల పాటు జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ టోర్నమెంట్‌ను 51.8 కోట్ల మంది భారతీయులు వీక్షించారని డిస్నీ చెప్పింది. హాట్‌స్టార్ స్ట్రీమింగ్ యాప్ ద్వారా 5.9 కోట్ల మంది ఫైనల్ మ్యాచ్‌ను చూసి రికార్డు నెలకొల్పినట్లు కంపెనీ వివరించింది. 2024 నుంచి 2027 వరకు భారతదేశంలో జరిగే అన్ని ఐసీసీ టోర్నమెంట్‌లను ప్రసారం చేయడానికి దాదాపు రూ.25 వేల కోట్లు చెల్లించి డిజిటల్, స్ట్రీమింగ్ హక్కులను కంపెనీ కొనుగోలు చేసినట్లు తెలిపింది. 

ఇదీ చదవండి: 15 ఏళ్ల బాలుడు.. రూ.100 కోట్ల కంపెనీ.. ఎలా సాధ్యమైందంటే..

పన్నెండేళ్ల తర్వాత భారత్‌లో ఆడిన ఐసీసీ ఫైనల్‌ టోర్నమెంట్‌ను 51.8 కోట్ల మంది చూసినట్లు బ్రాడ్‌కాస్ట్‌ ఆడియన్స్‌ రిసెర్చ్‌ కౌన్సిల్‌ ఇండియా(బీఏఆర్‌సీ) నిర్ధారించింది.  దాదాపు 42,200 కోట్ల నిమిషాల టీవీ స్క్రీన్‌ టైం నమోదైందని బీఏఆర్‌సీ తెలిపింది. కేవలం భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను 13 కోట్ల మంది, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌ను 8 కోట్ల మంది, ఇండియా వర్సెస్‌ పాకిస్థాన్‌ మ్యాచ్‌ను 7.5 కోట్ల మంది వీక్షించారని వివరించింది.

మరిన్ని వార్తలు