పాతపద్ధతే మేలు.. ‘ఎక్స్‌’ ప్రకటన

23 Nov, 2023 16:45 IST|Sakshi

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్‌మస్క్‌కు చెందిన ‘ఎక్స్‌’లో వాణిజ్య ప్రకటనల నుంచి వచ్చే ఆదాయం తగ్గిపోతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో గతంలోలాగాఎక్స్‌లో షేర్‌ చేసే లింక్స్‌కు సంబంధించిన హెడ్‌లైన్లు కనిపించేలా తిరిగి మార్పులు చేయనున్నట్లు సంస్థ అధికారులు తెలిపారు. ఇకపై ఇమేజ్‌లపైనే లింక్‌ హెడ్‌లైన్‌ కనిపిస్తుందని చెప్పారు.

ఈ హెడ్‌లైన్‌ ఆప్షన్‌కు సంబంధించి ఎలాన్‌ మస్క్‌ ఇతర వివరాలను వెల్లడించలేదు. లింక్‌ ప్రివ్యూలకు సంబంధించిన హెడ్‌లైన్లు కనిపించకుండా ‘ఎక్స్‌’లో అక్టోబరులో మార్పులు చేశారు. నెలలోపే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనున్నట్లు ప్రకటించారు. అక్టోబరులో చేసిన మార్పు ప్రకారం.. ఎక్స్‌లో పోస్ట్‌ చేసిన అంశంలోని విషయం తెలుసుకోవడానికి లీడ్‌ ఇమేజ్‌ పైభాగంలో ఉండే లింక్‌పై క్లిక్‌ చేయాల్సి ఉంటుంది. దాంతో పోస్ట్‌ చేసే వినియోగదారులు ఇమేజ్‌పైనే హెడ్‌లైన్‌ను రాసేవారు.

వినియోగదారులు ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌లోనే ఎక్కువ సమయం వెచ్చించేలా మార్పులు చేసినట్లు తెలిసింది. ఇమేజ్‌పై హెడ్‌లైన్‌ కనిపించడం వల్ల దృష్టి దానిపైకి మళ్లి యూజర్లు లింక్‌పై క్లిక్‌ చేసి ప్లాట్‌ఫామ్‌ నుంచి బయటకు వెళ్లిపోతున్నారని కంపెనీ వర్గాలు తెలిపాయి. లింక్స్‌ను కాకుండా నేరుగా కంటెంట్‌నే పోస్ట్‌ చేయాలని మస్క్‌ చెబుతున్నట్లు సమాచారం. దాంతో ఎంగేజ్‌మెంట్‌ పెరుగుతుందని అధికారులు చెప్పారు.

మరిన్ని వార్తలు