Vivo PMLA Case: మనీలాండరింగ్ కేసులో లావా ఎండీ అరెస్టు

10 Oct, 2023 16:08 IST|Sakshi

ఈడీ అదుపులో మరో ముగ్గురు వివో ఎగ్జిక్యూటివ్‌లు

మనీ లాండరింగ్ కార్యకలాపాలపై కొనసాగుతున్న విచారణలో భాగంగా లావా ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు హరి ఓం రాయ్‌తో పాటు వివో మొబైల్స్ ఇండియాకు చెందిన ముగ్గురు ఎగ్జిక్యూటివ్‌లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మంగళవారం అరెస్టు చేసింది. అయితే హరి ఓం రాయ్‌ ప్రమేయంపై నిర్దిష్ట వివరాలు ఇంకా వెల్లడించలేదు. వివో మొబైల్స్ ఇండియా, గ్రాండ్ ప్రాస్పెక్ట్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్స్ (జీపీఐసీపీఎల్‌)తో సహా 23 అనుబంధ కంపెనీలకు చెందిన 48 స్థానాల్లో ఈడీ దాడుల నిర్వహించింది. 

దిల్లీ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌కు అనుగుణంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఫిబ్రవరి 3, 2022న ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. అయిలే జీపీఐసీపీఎల్‌ నేరపూరిత చర్యలకు పాల్పడిందని ఆరోపిస్తూ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారు.

అక్రమంగా చైనాకు నిధులు తరలించడమే లక్ష్యంగా భారత్‌లో బోగస్‌ కంపెనీలను ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. భారత్‌లో పన్నులు ఎగవేస్తూ వివో మొబైల్స్ ఇండియా విక్రయాల ద్వారా వచ్చిన మొత్తంలో దాదాపు సగం డబ్బును చైనాకు తరలించిందనే ఆరోపణలు వచ్చాయి.
 

మరిన్ని వార్తలు