వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుందా..?

3 Mar, 2022 17:48 IST|Sakshi

ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు దిగినప్పటి నుంచి బంగారం, చమరు ధరలు భారీగా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ రోజు బ్యారెల్ బ్రెంట్ క్రూయిడ్ ఆయిల్ ధర 115 డాలర్లకు చేరుకుంది. అయితే, ఒకవైపు అంతర్జాతీయంగా చమరు ధరలు భారీగా పెరగడంతో ఆ ధరల నుంచి మన దేశ ప్రజలకు ఉపశమనం అందించడానికి కేంద్రం మార్గాలను అన్వేషిస్తోంది. వినియోగదారులపై చమురు ధరల ప్రభావం పడకుండా ఉండటానికి లీటరు పెట్రోల్, డీజిల్'పై రూ.8-10 ఎక్సైజ్ సుంకన్నీ తగ్గించడానికి కేంద్రం ఆలోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు బిజినెస్ టుడే మీడియాకు తెలిపాయి. 

గత ఏడాది నవంబర్ నెలలో 68 డాలర్లు ఉన్న బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర నేడు 115 డాలర్లకు చేరుకుంది. అప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలలో పెద్దగా మార్పులేదు. "అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశంలో డీజిల్ & పెట్రోల్ ధరలు ఇప్పటి వరకు లీటరుకు రూ.9-14 ఎక్కువగా ఉండాలి" అని ఎస్బిఐ ఎకోర్యాప్ కొద్ది రోజుల క్రితం తన నివేదికలో తెలిపింది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినట్లయితే, అప్పుడు ఖజానాకు లక్ష కోట్ల రూపాయలు నష్ట వస్తుంది. కాబట్టి, అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశంలో డీజిల్ & పెట్రోల్ ధరలు పెంచే అవకాశం కూడా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 

చమురు ధరల ప్రభావం వినియోగదారుడి మీద పడకుండా ఉండటానికి కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకన్నీ, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గిస్తే పరిస్థితి చక్కదిద్దుకొనే అవకాశం ఉన్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ప్రపంచ ముడి చమురు ధరలు పెరిగిన ప్రకారం దేశంలో చమురు ధరలను పెంచితే ద్రవ్యోల్బణం 52-65 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు, రేట్లు పెరగకుండా చూడటం కోసం ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు సుమారు రూ.7 తగ్గించినట్లయితే, అప్పుడు నెలకు రూ.8,000 కోట్ల ఎక్సైజ్ సుంకం నష్టం వాటిల్లుతుంది అని ఎస్బీఐ తన నివేదికలో తెలిపింది. చూడాలి మరి మార్చి తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది.

(చదవండి: కొత్తగా రుణం కోసం దరఖాస్తు చేసుకునే వారికి షాకిస్తున్న బ్యాంకులు..!)

మరిన్ని వార్తలు