వేగంగా బ్యాంకుల ప్రైవేటీకరణ..కేంద్రం మరో కీలక నిర్ణయం!

21 Mar, 2022 10:01 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు రెండింటిని ప్రయివేటైజ్‌ చేసేందుకు వీలుగా ఆర్థిక శాఖ రానున్న రోజుల్లో కేబినెట్‌ అనుమతి కోరే అవకాశముంది. ఇందుకు అనుగుణంగా బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టం 1949కు సవరణలు ప్రతిపాదిస్తోంది. వీటితోపాటు ఇతర నిబంధనలను సైతం మార్పు చేసే యోచనలో ఉంది. 

ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌ : కాగా ఏయే పీఎస్‌బీలను ప్రైవేటీకరించేది ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా వెల్లడించలేదు. అయితే సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (సీబీఐ), ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ)లను ప్రైవేటీకరించాలని నీతి ఆయోగ్‌ సిఫారసు చేసినట్టు సమాచారం. ఈ రెండు బ్యాంకుల్లో వాటా విక్రయానికి వీలుగా 20 శాతం విదేశీ పెట్టుబడుల పరిమితిని తొలగించాలని ప్రతిపాదిస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలియజేశాయి. 

అంతేకాకుండా ఈ రెండు బ్యాంకుల ఉద్యోగులకు అత్యంత ఆకర్షణీయ స్వచ్చంద పదవీ విరమణ(వీఆర్‌ఎస్‌) పథకాన్ని సైతం ప్రతిపాదిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ ప్రతిపాదనలకు సంబంధించి ముసాయిదా కేబినెట్‌ నోట్‌పై అంతర్‌మంత్రిత్వ చర్చలు పూర్తయినట్లు తెలుస్తోంది. బ్యాంకుల ప్రైవేటైజేషన్‌ సంబంధ సూచనలను పరిగణణలోకి తీసుకుని తుది ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు పేర్కొన్నారు.

చదవండి: బ్యాంకుల ప్రైవేటీకరణే పరిష్కారమా?

మరిన్ని వార్తలు