Patanjali: అది నిరూపిస్తే చావడానికైనా సిద్ధమే: బాబా రామ్‌దేవ్

22 Nov, 2023 21:06 IST|Sakshi

ఆధునిక వైద్య విధానాన్ని, అల్లోప‌తి ముందులను టార్గెట్ చేస్తూ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదారి ప‌ట్టించే ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారని పతంజలిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన జరిగిన ఒకరోజు తర్వాత బాబా రామ్‌దేవ్ అల్లోపతి ‘డాక్టర్ల ముఠా’ తన కంపెనీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 

బాబా రామ్‌దేవ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘యోగా, ఆయుర్వేదం, ప్రకృతివైద్యం, సనాతన విలువలకు వ్యతిరేకంగా కొందరి వైద్యుల బృందం ప్రచారం చేస్తోంది. రక్తపోటు, మధుమేహం, ఆస్తమా, కీళ్లనొప్పులు, కాలేయ వ్యాధి, మూత్రపిండాల సమస్యలు వంటివాటికి పరిష్కారం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పతంజలి మందుల ద్వారా వ్యాధులు నయం అయ్యాయని శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. యోగా, ఆయుర్వేదం, ప్రకృతివైద్యం ద్వారా మధుమేహం, థైరాయిడ్ సమస్యలు, అధిక రక్తపోటు, ఉబకాయం వంటి ఎన్నో వ్యాధులను నయం చేస్తున్నాం. సుప్రీంకోర్టు, దేశ చట్టాలు, రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. మేము నిజంగానే తప్పుగా ప్రచారం చేస్తే జరిమానా విధించండి. వైద్యుల బృందం అన్నట్లుగా మేము నిరాధార ఆరోపణలు చేసినట్లు నిరూపిస్తే చావడానికైనా సిద్ధమే. తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలి. శతాబ్దాలుగా ఉన్న యోగా, నేచురోపతి, ఆయుర్వేద వైద్యాలపై గత ఐదేళ్లుగా  తప్పుడు ప్రచారం చేస్తున్నారు. శాస్త్రీయ పరిశోధనలు, ప్రీ, పోస్ట్ క్లినికల్ ట్రయల్స్,  ప్రోటోకాల్‌లను కలుపుకొని పతంజలి 500 అధ్యయనాలు నిర్వహించింది’ అని రామ్‌దేవ్‌ అన్నారు.

ఇదీ చదవండి: గంటలోనే అమ్ముడైన 4.5 కోట్ల షేర్లు

అల్లోప‌తి ఔష‌ధాలకు వ్యతిరేకంగా ప్రజలను త‌ప్పుదారి ప‌ట్టించే ప్ర‌క‌ట‌న‌ల‌ను నిలిపివేయాల‌ని సుప్రీంకోర్టు పతంజలిని ఆదేశించింది. ఇలాంటి ఉల్లంఘనను కోర్టు తీవ్రంగా పరిగణించనున్న కోర్టు ప్రతి తప్పుడు క్లెయిమ్‌కు గరిష్టంగా రూ.1 కోటి వరకు  జరిమానా తప్పదని  హెచ్చరించింది.

మరిన్ని వార్తలు