Google: ప్రభుత్వ ఉద్యోగులకు గూగుల్‌ బంపరాఫర్‌.. 

7 Sep, 2023 16:57 IST|Sakshi

దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ (Google) బంపరాఫర్‌ ప్రకటించింది. 1,000 మంది ప్రభుత్వ అధికారులకు సైబర్‌ సెక్యూరిటీలో శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ యూనిట్ సెర్ట్‌ఇన్‌ (CERT-In)తో గూగుల్‌ క్లౌడ్‌ (Google Cloud) తన భాగస్వామ్యాన్ని ప్రకటించింది. 

సెర్ట్‌ఇన్‌ అనేది ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY)లో భాగం. ఇది సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్‌, హ్యాకింగ్, ఇతర సైబర్ సంబంధిత సమస్యలను చూసుకుంటుంది. (IT jobs data: దారుణంగా ఐటీ ఉద్యోగాలు.. ప్రముఖ జాబ్‌ పోర్టల్‌ రిపోర్ట్‌!)

రూ.లక్ష స్కాలర్‌షిప్‌ కూడా..
'సైబర్ ఫోర్స్' పేరుతో కొంతమంది ప్రభుత్వ అధికారులకు సైబర్ డిఫెన్స్ బెస్ట్ ప్రాక్టీస్‌లలో శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగంగా వీరికి జనరేటివ్ ఏఐ వినియోగం, సైబర్ సెక్యూరిటీ ఏఐ హ్యాకథాన్‌ల నిర్వహణ వంటివి గూగుల్‌ క్లౌడ్, మాండియంట్ నిపుణులచే నిర్వహించన్నట్లు గూగుల్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఉద్యోగులకు ఉచిత శిక్షణతోపాటు రూ.లక్ష స్కాలర్‌షిప్‌ కూడా ఇవ్వననున్నట్లు పేర్కొంది.

‘సైబర్ భద్రత మన డిజిటల్ భవిష్యత్తుకు మూలస్తంభం. నిరంతరం అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ ప్రపంచంలో మరింత ముందుకు సాగాలంటే జనరేటివ్‌ ఏఐ శక్తిని వినియోగించుకోవడం చాలా అవసరం’ అని సెర్ట​్‌ఇన్ డైరెక్టర్ జనరల్ సంజయ్ బహ్ల్ పేర్కొన్నారు. 

ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖతో కలిసి దేశవ్యాప్తంగా భారతీయులకు అవసరమైన నైపుణ్యాభివృద్ధిని సులభతరం చేస్తున్నామని, కొత్త సురక్షితమైన భద్రత సేవలను అందించడానికి సహకారం అందిస్తున్నామని గూగుల్‌ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ అన్నారు.

మరిన్ని వార్తలు