ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకే కేంద్రం కసరత్తు

25 Dec, 2023 08:45 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆహారోత్పత్తుల రిటైల్‌ ధరలను అదుపు చేసేందుకు గత కొన్నేళ్లలో కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకున్నట్లు ఆహారం, వినియోగ వ్యవహారాల మంత్రి పీయూష్‌ గోయల్‌ తాజాగా పేర్కొన్నారు. వెరసి దేశ ఆర్ధిక వ్యవస్థ వృద్ధికి భరోసానిస్తూ ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని తగిన స్థాయిలో నియంత్రించనున్నట్లు తెలియజేశారు.

నేషనల్‌ కన్జూమర్‌ డే సందర్భంగా ఇక్కడ నిర్వహించిన ఒక వేడుకలో గోయల్‌ ఇంకా పలు అంశాలపై మాట్లాడారు. ప్రస్తుతం అత్యంత వేగవంతంగా వృద్ధి సాధిస్తున్న భారీ ఎకానమీగా భారత్‌ నిలుస్తున్నట్లు ప్రస్తావించారు. భవిష్యత్‌లో వృద్ధిని కొనసాగించడంతోపాటు.. ద్రవ్యోల్బణాన్ని అదుపులోనే ఉంచేందుకు చర్యలు కొనసాగించనున్నట్లు తెలియజేశారు.

కాగా.. అధికారిక గణాంకాల ప్రకారం గత(నవంబర్‌) నెలలో వినియోగ ధరల ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగి 5.55 శాతాన్ని తాకింది. ఇది మూడు నెలల గరిష్టంకాగా.. అక్టోబర్‌లో 4.87 శాతంగా నమోదైంది. అయితే ఆగస్ట్‌లో ద్రవ్యోల్బణం 6.83 శాతానికి చేరాక క్షీణిస్తూ వస్తోంది.      

>
మరిన్ని వార్తలు