ప్రత్యక్ష తనిఖీ తర్వాతే జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌

22 Aug, 2020 04:31 IST|Sakshi

ఆధార్‌ అథెంటికేషన్‌ లేని కేసులకే: సీబీఐసీ

న్యూఢిల్లీ: జీఎస్‌టీ కింద నమోదు చేసుకునే వ్యాపార సంస్థలు ఆధార్‌ గుర్తింపు ధ్రువీకరణను ఇవ్వలేకపోతే.. ఆయా సంస్థల వ్యాపార స్థలాలను పరిశీలించిన అనంతరమే రిజిస్ట్రేషన్‌ మంజూరు అవుతుందని పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ కేంద్ర మండలి(సీబీఐసీ) స్పష్టం చేసింది. ఈ నెల 21 నుంచి జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ కోసం దరఖాస్తుదారులు ఆధార్‌ ఆథెంటికేషన్‌ను ఎంచుకోవచ్చని సీబీఐసీ తన నోటిఫికేషన్‌లో తెలిపింది.

ఆథార్‌ గుర్తింపు ధ్రువీకరణలో విఫలమైనా లేక ఆధార్‌ అథెంటికేషన్‌ను ఎంచుకోకపోయినా.. అటువంటి దరఖాస్తులకు సంబంధించి వ్యాపార కేంద్రాలను పరిశీలించిన తర్వాతే జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ పూర్తి చేస్తామని పేర్కొంది. దీనిపై పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్‌నర్‌ నేషనల్‌ లీడర్‌ ప్రతీక్‌ జైన్‌ స్పందిస్తూ.. ‘పన్ను చెల్లింపుదారు జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ కోరుకుంటే ఆధార్‌ అథెంటికేషన్‌ను ఎంచుకోవచ్చు. దీనికి ప్రత్యక్ష పరిశీలన అవసరం లేకుండా 3 రోజుల్లో రిజిస్ట్రేషన్‌ మంజూరు అవుతుంది. లేదంటే 21 రోజులు పడుతుంది. అధికారులు ప్రత్యక్షంగా ఆయా వ్యాపార కేంద్రాలను తనిఖీ చేసి, పత్రాల పరిశీలన తర్వాతే రిజిస్ట్రేషన్‌ మంజూరు చేస్తారు’’ అని వివరించారు. 

మరిన్ని వార్తలు