Hero Electric: ఎలక్ట్రిక్‌ వాహనదారుల ఛార్జింగ్‌ కష్టాలకు చెక్!

24 Sep, 2021 16:42 IST|Sakshi

ఎలక్ట్రిక్‌ వెహికల్‌ వినియోగదారులకు శుభవార్త. దేశీయ ఎలక్ట్రిక్ వాహన తయారీ దిగ్గజం హీరో ఎలక్ట్రిక్ భారీ ఎత్తున ఎలక్ట్రిక్‌ ఛార‍్జింగ్‌ స‍్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఢిల‍్లీకి చెందిన ఓ స్టార్టప్‌ భాగస్వామ్యంలో దేశం మొత్తం మీద ఈ ఏడాది చివరి నాటికి 10వేల ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు హీరో ఎలక్ట్రిక్‌ సీఈఓ సోహిందర్‌ గిల్‌ తెలిపారు. 
 
పెట్రో ధరలు పెరగడం, తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించేలా ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో వినియోగదారులు ఎలక్ట్రిక్‌ వాహనాలవైపు మొగ్గుచూపుతున్నారు.అయితే ఎలక్ట్రిక్‌ వాహనాలు కొనుగోలు చేసినా..వాటి ఛార్జింగ్‌ నిర్వహణ కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో పలు ఆటోమొబైల్‌ కంపెనీలు దేశ వ్యాప్తంగా ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నాయి. తాజాగా  హీరో ఎలక్ట్రిక్‌ సంస్థ వచ్చే ఏడాది చివరి నాటికి మొత్తం 20వేల ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ సందర్భంగా సోహిందర్‌ గిల్‌ మాట్లాడుతూ ఇటీవల కాలంలో కేంద్రం ఈవీ వెహికల్స్‌ వినియోగాన్ని ప్రోత్సహించడంపై ఆటోమొబైల్‌ సంస్థలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. 

హీరో ఎలక్ట్రిక్‌ సైతం ఈవీ  విభాగంలో  ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ను ప్రోత్సహించేలా తక్కువ ధరకే ఛార్జింగ్ స్టేషన్లను తయారు చేసేందుకు పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 1650 ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేశాం. 2022 చివరి నాటికి 20వేల ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. అంతేకాదు ఇటీవల తాము నిర్వహించిన సర్వేలో ఛార్జింగ్‌ స్టేషన్ల అవసరం ఎలా ఉందో గుర్తించాం. అవసరానికి తగ్గేట్లే ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని హీరో ఎలక్ట్రిక్‌ సీఈఓ సోహిందర్‌ గిల్‌ చెప్పారు. 

చదవండి: మార్కెట్‌లో మరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌, మిగిలిన వాటితో పోలిస్తే ధర తక్కువే

మరిన్ని వార్తలు