హీరో మోటో స్కూటర్లు,బైక్ల ధరల మోత
ఏప్రిల్ నుంచి ధరల పెంపు అమలు
సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ బైక్ లవర్స్కి షాకిచ్చింది. వచ్చే నెలనుంచి తన మోటార్ సైకిళ్ల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులరీత్యా తమ అన్ని మోడళ్ల బైక్లు, స్కూటర్ల ధరలను పెంచాల్సి వస్తోందని ప్రకటించింది. సవరించిన ధరలు అన్ని షోరూంలలో 2021 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తాయని ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో సంస్థ వెల్లడించింది. (మారుతి కార్ల ధరలకు రెక్కలు)
వినియోగదారుల మీద తక్కువ భారం పడేలా, తమ ఖర్చులను తగ్గించుకునే కార్యక్రమాన్ని వేగవంతం చేసినట్టు హీర మోటో తెలిపింది. అయితే ధరల పెరుగుదల పరిమాణంపై కంపెనీ నిర్దిష్ట వివరాలు ఇవ్వలేదు. కానీ, ఈ పెరుగుదల రూ .2500 వరకు ఉంటుందని, మోడల్, నిర్దిష్ట మార్కెట్ ఆధారంగా ఉంటుందని హీరో తెలిపింది. కాగా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇన్పుట్ ఖర్చుల భారం నేపథ్యంలో అన్నిమోడళ్ల కార్ల ధరలను పెంచుతున్నట్టు మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.