ధరలు పైపైకి.. ఆ ఇళ్లకు ఫుల్‌ డిమాండ్‌, అవే కావాలంటున్న ప్రజలు!

16 Dec, 2022 09:07 IST|Sakshi

6–10 శాతం పెరిగే అవకాశం 

క్రిసిల్‌ తాజా నివేదికలో వెల్లడి 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరు ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు 6–10 శాతం పెరిగే అవకాశం ఉందని క్రిసిల్‌ వెల్లడించింది. 2023–24లో 3–5 శాతం ధరలు దూసుకెళ్లవచ్చని అంచనా వేస్తోంది. ముడి సరుకు వ్యయాలు, కూలీ, స్థలాల ధరలు అధికం కావడమే ఇందుకు కారణమని వివరించింది.

హైదరాబాద్, ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్, నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్, బెంగళూరు, పుణే, కోల్‌కత నగరాల ఆధారంగా క్రిసిల్‌ రూపొందించిన నివేదిక ప్రకారం.. రెసిడెన్షియల్‌ విభాగంలో పెద్ద రియల్టర్లు 2022–23లో 25 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 10–15 శాతం అమ్మకాల వృద్ధిని నమోదు చేయబోతున్నారు.

అమ్మకం కాని ఇళ్ల స్థాయి 4 నుండి 2.5 సంవత్సరాలకు వచ్చి చేరింది. ఇది పెద్ద రియల్టర్ల క్రెడిట్‌ ప్రొఫైల్‌ను బలపరుస్తుంది.  

ఖరీదైన ఇళ్లకు డిమాండ్‌..
కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల్లో మహమ్మారి ముందు పెద్ద రియల్టర్ల వాటా 30 శాతం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 40–45 శాతం ఉండే అవకాశం ఉంది. పరిశ్రమలో పెద్ద రియల్టర్ల వాటా 2022–23లో 24 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 25 శాతానికి చేరనుంది.

మహమ్మారి ముందు కాలంలో ఇది 14 శాతం నమోదైంది. 2020కి ముందు రూ.1.5 కోట్లు ఆపైన ఖరీదు చేసే ఇళ్ల వాటా 25–30 శాతం. ఇప్పుడు ఇది ఏకంగా 40–45 శాతానికి ఎగసింది.

రూ.40 లక్షల లోపు ఉండే అందుబాటు ధరల గృహాల వాటా 30 నుంచి 10 శాతానికి పరిమితం అయింది. గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో పెద్ద రియల్టర్లు వాటాల విక్రయం,ఆస్తుల అమ్మకం ద్వారా రూ.18,000 కోట్లు అందుకున్నారు. ఈ సంస్థల  ఆస్తుల్లో అప్పుల నిష్పత్తి 2023 మార్చి నాటికి 23 శాతం, 2024 మార్చికల్లా 21 శాతంగా ఉండనుంది.
 

చదవండి: భారత్‌లో అత్యంత ఖరీదైన కారు కొన్న హైదరాబాద్‌ వాసి.. వామ్మో అన్ని కోట్లా!


 

మరిన్ని వార్తలు