రికార్డు స్థాయిలో ఇళ్ల అమ్మకాలు.. ఆ నగరాల్లో ఎగబడి కొంటున్నారు!

27 Oct, 2022 20:26 IST|Sakshi

ప్రజలకు సొంతిళ్లు ఉండాలనేది ఓ కల. అందుకోసం ఎన్నో కష్టాలు పడి ఆ కలను నెరవేర్చకుంటారు. అందుకే మార్కెట్లో ఇళ్లకు విపరీతమైన డిమాండ్‌. ఈ ఏడాది గృహాల అమ్మకాలు ఆల్‌ టైమ్‌ హై నమోదు కానున్నాయని ప్రాపర్టీ కన్సల్టెంట్‌ అనరాక్‌ నివేదిక వెల్లడించింది. ఏడు నగరాల్లో రికార్డు స్థాయిలో 3.6 లక్షల యూనిట్లు అమ్ముడవుతాయని అంచనా వేస్తోంది. నివేదిక ప్రాకారం.. వడ్డీ రేట్లు, ఇళ్లు ప్రియం అవుతున్నప్పటికీ అన్ని ధరల విభాగాల్లో బలంగా డిమాండ్‌ ఉండనుంది. ఏడాదిలో ఇళ్ల ధరలు కనీసం 10 శాతం దూసుకెళ్లాయి. గృహ రుణంపై వడ్డీ రేట్లు 6.5 నుంచి 8.5 శాతానికి పెరిగినప్పటికీ ఈ పండుగ నెలలో హౌసింగ్‌ డిమాండ్‌ కొనసాగుతోంది.

హైదరాబాద్, ఢిల్లీ రాజధాని ప్రాంతం, ముంబై మెట్రోపాలిటన్‌ ప్రాంతం, కోల్‌కత, చెన్నై, బెంగళూరు, పుణేలో ఇప్పటికే 2022 జనవరి–సెప్టెంబర్‌ కాలంలో కోవిడ్‌ ముందస్తు స్థాయిని దాటి 2,72,710 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. 2019 తొలి తొమ్మిది నెలల్లో 2,61,360 ఇళ్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. 2014లో అత్యధికంగా 3,42,980 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఇక ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఇళ్లు 2,64,780 యూనిట్లుగా ఉంది. డిసెంబర్‌ నాటికి మొత్తం 3.4 లక్షల యూనిట్లను దాటతాయని అంచనా. 2014లో నూతనంగా అందుబాటులోకి వచ్చిన గృహాలు రికార్డు స్థాయిలో 5.45 లక్షల యూనిట్లు. ‘దేశంలో 2022 రెసిడెన్షియల్‌ మార్కెట్‌ చరిత్ర సృష్టిస్తుంది. ఇప్పటికే అన్ని మునుపటి గరిష్టాలను పరిశ్రమ అధిగమించింది. కొనసాగుతున్న పండుగ సీజన్‌లో బలమైన అమ్మకాలు ఉంటాయి’ అని అనరాక్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అనుజ్‌ పురి తెలిపారు.

చదవండి: ‘నిజం తెలుసుకున్నా, ఆ కంపెనీ నాకొద్దు’.. ఊహించని షాకిచ్చిన బిలియనీర్‌!

మరిన్ని వార్తలు