ప్రైవేటు బ్యాంకుగానే ఐడీబీఐ బ్యాంక్‌, స్పష్టం చేసిన కేంద్ర ఆర్ధిక శాఖ

28 Nov, 2022 07:06 IST|Sakshi

న్యూఢిల్లీ: బీమా దిగ్గజం ఎల్‌ఐసీ, ప్రభుత్వ వాటాల విక్రయం తదుపరి ఐడీబీఐ బ్యాంకు దేశీ ప్రయివేట్‌ రంగ సంస్థగా కొనసాగనున్నట్లు ఆర్ధిక శాఖ తాజాగా స్పష్టతనిచ్చింది. వ్యూహాత్మక విక్ర యం తదుపరి మిగిలిన 15% ప్రభుత్వ వాటాను పబ్లిక్‌ షేర్‌ హోల్డింగ్‌గా పరిగణించనున్నట్లు తెలియజేసింది. పబ్లిక్‌కు కనీస వాటా(ఎంపీఎస్‌) విషయంలో బ్యాంకు కొత్త యాజమాన్యానికి అధిక గడువును అనుమతించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. 

అంతేకాకుండా బ్యాంకును గెలుపొందిన బిడ్డర్‌ అనుబంధ సంస్థల పునర్వ్యవస్థీకరణను చేపట్టడంలో ఎలాంటి ఆంక్షలు ఉండబోవని స్పష్టం చేసింది. బ్యాంకు కొనుగోలులో భాగంగా ముందస్తు ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) సందేహాలకు సమాధానమిచ్చే ప్రక్రియకింద ఆర్థిక శాఖ నిర్వహణలోని దీపమ్‌ ఈ అంశాలపై వివరణ ఇచ్చింది. ఐడీబీఐ బ్యాంకు విక్రయానికి ప్రభుత్వం అక్టోబర్‌ 7న బిడ్స్‌కు ఆహ్వానం పలికింది. డిసెంబర్‌ 16కల్లా కొనుగోలుదారులు ఈవోఐలను దాఖలు చేయవలసి ఉంటుంది. 

సంయుక్తంగా విక్రయం 
ఐడీబీఐ బ్యాంకులో 60.72 శాతం వాటాను ప్రభుత్వం, ఎల్‌ఐసీ సంయుక్తంగా విక్రయించనున్నాయి. ప్రస్తుతం ఈ రెండింటికీ ఐడీబీఐ బ్యాంకులో 94.72 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఎల్‌ఐసీకి 49.24 శాతం, ప్రభుత్వానికి 45.48 శాతం చొప్పున వాటా ఉంది. పబ్లిక్‌ వాటా 5.2 శాతంగా నమోదైంది. దీంతో కొనుగోలుదారుడు 5.28 శాతం వాటా కోసం ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించవలసి వస్తుంది. విక్ర యంలో భాగంగా ఎల్‌ఐసీ 30.24 శాతం, ప్రభు త్వం 30.48 శాతం చొప్పున వాటాలు ఆఫర్‌ చేయనున్నాయి. విక్రయానంతరం ప్రభుత్వం 15%, ఎల్‌ఐసీ 19% చొప్పున వాటాలను కలిగి ఉంటాయి. 

మరిన్ని వార్తలు