2030 నాటికి అగ్రగామిగా భారత్.. నితిన్ గడ్కరీ

23 Dec, 2023 17:34 IST|Sakshi

భారతదేశంలో రోజురోజుకి ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి, వినియోగం పెరుగుతూనే ఉంది. వాహన తయారీ సంస్థలు కూడా ఈ విభాగంలో లెక్కకు మించిన వాహనాలను విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నాయి. ఈ తరుణంలో కేంద్రమంత్రి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

భారతదేశంలో ఏడాదికి 10 మిలియన్ల ఎలక్ట్రిక్ వెహికల్ (EV) విక్రయాలు జరిగే అవకాశం ఉందని, 2030 నాటికి ఈ విభాగంలో దాదాపు 50 మిలియన్ల ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నట్లు కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' తాజాగా వెల్లడించారు.

దేశంలో ఇప్పటికే 3,45,4000 ఎలక్ట్రిక్ వాహనాలు నమోదైనట్లు.. ఈ విభాగంలో భారత్ ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానం పొందనున్నట్లు నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఇంధన దిగుమతులు కూడా తగ్గుతాయని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థను పెంపొందించడంలో సహాయపడుతుందని అన్నారు.

వాయుకాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా దేశంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లు తయారవుతున్నాయి. అంతే కాకుండా ఇప్పటికే ఉన్న కార్లను కూడా ఎలక్ట్రిక్ కార్లుగా మార్చేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని గడ్కరీ తెలిపారు. కేవలం రోజు వారీ వినియోగానికి ఉపయోగించే వాహనాలు మాత్రమే కాకుండా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, లాజిస్టిక్ వంటి వాటిలో కూడా ఈవీల వినియోగం పెంచడానికి తగిన చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు.

ఇదీ చదవండి: భవిష్యత్తు వీటిదే అంటున్న నితిన్ గడ్కరీ - వైరల్ వీడియో

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలను అందించాయి. దీంతో తక్కువ కాలంలోనే ఈవీల సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం ఈ సబ్సిడీలను పరిమితం చేసినప్పటికీ.. కొన్ని రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు కల్పిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు