యూఎస్‌కు భారతీయ బొమ్మలు

13 Apr, 2023 04:07 IST|Sakshi

యూరప్‌ కంపెనీలూ ఆసక్తి 

టాయ్‌ అసోసియేషన్‌ వెల్లడి

ప్యారిస్‌: భారత్‌లో తయారైన బొమ్మలను దిగుమతి చేసుకునేందుకు యూఎస్, యూరప్‌కు చెందిన దిగ్గజ కంపెనీలు  ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ సంస్థలు పెద్ద ఎత్తున బొమ్మలను కొనుగోలు చేసి ఆయా దేశాల్లో విక్రయించాలని భావిస్తున్నాయని ప్రభుత్వ అధికారుల సమాచారం. అంతేకాదు అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా తయారీ చేపట్టేందుకు వీలుగా ఇక్కడి కంపెనీలకు సాయం అందించేందుకూ ముందుకు రానున్నాయి. దేశీయంగా బొమ్మల తయారీని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్న డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ, ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డీపీఐఐటీ).. ఎగుమతులను పెంచడానికి విదేశీ కంపెనీలతో భాగస్వామ్యానికి కూడా సహాయం చేస్తోంది.

డీపీఐఐటీ తోడ్పాటు..
బొమ్మల కొనుగోలుకై ఇటీవలే యూఎస్‌కు చెందిన ప్రముఖ రిటైల్‌ కంపెనీ ఒకటి ఇక్కడి పరిశ్రమను సంప్రదించిందని ప్లేగ్రో టాయ్స్‌ ప్రమోటర్, టాయ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ మను గుప్తా తెలిపారు. రూ.3,280 కోట్ల విలువైన రైడ్‌ ఆన్, ఔట్‌డోర్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ టాయ్స్‌ను దిగుమతి చేసుకునేందుకు ముందుకు వచ్చిందని చెప్పారు. అలాగే ఇటలీ కంపెనీ సైతం ఆసక్తి చూపుతోందని వెల్లడించారు. ప్రపంచ దిగ్గజ కంపెనీలతో భాగస్వామ్యానికి, ఆర్డర్లు పొందేందుకు ఇక్కడి కంపెనీలకు డీపీఐఐటీ తోడ్పాటు అందిస్తోందని వివరించారు. భారత కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికులకు నైపుణ్యం మెరుగుపరిచేందుకు విదేశీ కంపెనీలు చేయి అందించనున్నాయని తెలిపారు. విదేశీ సంస్థలతో చేతులు కలిపేందుకు 82 భారతీయ కంపెనీలు అడుగు ముందుకు వేశాయన్నారు.  

ఎగుమతులు ఇలా..
భారత్‌ నుంచి 2022–23 ఏప్రిల్‌–డిసెంబర్‌ కాలంలో రూ.1,017 కోట్ల విలువైన ఆట వస్తువులు ఎగుమతి అయ్యాయి. 2021–22లో వీటి విలువ రూ.2,601 కోట్లు. 2013–14 ఏప్రిల్‌–డిసెంబర్‌లో ఇక్కడి నుంచి విదేశాలకు చేరిన బొమ్మల విలువ కేవలం రూ.167 కోట్లు మాత్రమే. విదేశాల నుంచి భారత్‌కు దిగుమతైన బొమ్మల విలువ 70 శాతం క్షీణించి 2021–22లో రూ.870 కోట్లుగా ఉంది. 20 శాతంగా ఉన్న దిగుమతి సుంకం 2020 ఫిబ్రవరిలో 60 శాతానికి చేర్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దిగుమతి సుంకం 70 శాతం ఉంది. దిగుమతులను నిరుత్సాహపర్చడం, దేశీయంగా తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకాన్ని బొమ్మల తయారీకి వర్తింపజేయాలని కేంద్రం భావిస్తోంది.

మరిన్ని వార్తలు