ఎలక్ట్రిక్‌ కార్లపై దిగుమతి సుంకం తగ్గించే యోచనలో కేంద్రం, మస్క్‌ పంతం నెగ్గించుకున్నారా?

13 Nov, 2023 14:36 IST|Sakshi

కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్‌ కార్లపై విధించే దిగుమతి సుంకం(ఇంపోర్ట్‌ ట్యాక్స్‌)పై 15 శాతం తగ్గించేందుకు సిద్ధమైనట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

కొన్నేళ్ల క్రితం మస్క్‌ టెస్లా కార్లను చైనా, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుని భారత్‌లో అమ్మాలని ఉవ్విళ్లూరారు. కానీ, కేంద్రం దీన్ని వ్యతిరేకించింది. భారత్‌లో టెస్లా కార్లను అమ్ముకోవచ్చు. చైనా నుంచి లేదంటే మరో దేశం నుంచి దిగుమతి చేసుకుని విక్రయిస్తామంటే కుదరదు అని తేల్చి చెప్పింది. దీంతో భారత్‌లో టెస్లా కార్ల అమ్మకాలపై మస్క్‌ వెనక్కి తగ్గారు. 

ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భాగంగా మస్క్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం పరిణామాలు వేగంగా మారుతూ వస్తున్నాయి. తాజాగా, కేంద్రం ఈవీ వాహనలపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని భావిస్తున్నట్లు నివేదికలు హైలెట్‌ చేశాయి. 

టెస్లా అభ్యర్ధనపై కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌?
ప్రస్తుతం, భారత్‌లో టెస్లా కార్ల మ్యానిఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకై జరుపుతున్న చర్చలు ఓ కొలిక్కి రాగా.. దీన్ని మరింత ముందుకు సాగేలా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతి సుంకాలను 15శాతానికి తగ్గించాలన్న టెస్లా అభ్యర్థనను భారత ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.   

చవకగా టెస్లా కార్లు 
తన అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసేలా టెస్లా జర్మనీలో ప్లాంట్‌ నిర్మించేలా ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంది. ఈ సమయంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. తొలుత బడ్జెట్‌ ధరలో టెస్లా కార్ల అమ్మకాల్ని చేపట్టేలా భారత్‌లో టెస్లా తయారీ ప్లాంట్‌లను నిర్మించాలని అనుకున్నారు. అయితే, మస్క్‌ మనసు మార్చుకుని ఇప్పుడు ఇదే కారును జర్మనీలో తయారు చేయనున్నారు. లాంచ్ అయిన తర్వాత టెస్లా కార‍్లలో ఇదే అత్యంత బడ్జెట్‌ కారు కానుంది. ప్రస్తుతం బడ్జెట్‌ ధరలో టెస్లా మోడల్‌ 3 సెడాన్‌  దీని ధర సుమారు రూ.22.50లక్షలుగా ఉంది.  

మరిన్ని వార్తలు