2030 నాటికి జపాన్ను వెనక్కునెట్టే అవకాశం
7.3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఆవిర్భవించే సత్తా
ఎస్అండ్పీ గ్లోబల్ అంచనా
న్యూఢిల్లీ: భారత్ 2030 నాటికి జపాన్ను అధిగమించి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉందని ఎస్అండ్పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ పేర్కొంది. అప్పటికి భారత్ స్థూల దేశీయోత్పత్తి 7.3 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందన్న విశ్వాసాన్ని వెలిబుచ్చింది. ఇదే జరిగితే ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో చైనా తర్వాత భారత్ ఎకానమీ రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా సైతం ఆవిర్భవిస్తుంది.
పటిష్ట ఆర్థిక వ్యవస్థతో ప్రపంచంలో వేగవంతమైన ఎకానమీ వృద్ధి రేటును భారత్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. రానున్న దశాబ్ద కాలంలో కూడా ఇదే ధోరణి కొనసాగే వీలుంది. 2024 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరంలో 6.2 శాతం నుంచి 6.3 శాతం శ్రేణిలో భారత్ ఎకానమీ వృద్ధి సాధిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఆయా అంశాలకు సంబంధించి ఎస్అండ్పీ గ్లోబల్ తాజా నివేదిక ఏమి చెబుతోందంటే..
భారత్ పురోగతి బాట పటిష్టం: ఆర్థికశాఖ
భారత్ 2024 మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రపంచంలోనే వేగవంతమైన ఎకానమీ హోదాను కొనసాగిస్తుందని ఆర్థిక మంత్రిత్వశాఖ సెపె్టంబర్ నెలవారీ సమీక్షా నివేదిక స్పష్టం చేసింది. ద్రవ్యోల్బణం దిగిరావడంసహా భారత్ ఆర్థిక ఫండమెంటల్స్ పటిష్టంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. పశ్చిమాసియా సవాళ్లు, పరిణామాలు అంతర్జాతీయ క్రూడ్ ధరలపై ప్రభావం చూ పుతాయని అభిప్రాయపడింది. అమెరికా స్టాక్ మార్కె ట్లు బలహీన ధోరణిలో ఉన్నట్లు కనిపిస్తోందని, ఇది పూర్తి వాస్తవ రూపం దాల్చితే మిగిలిన మార్కెట్లపైనా ఈ ప్రభావం పడవచ్చని వివరించింది.
ప్రస్తుతం అయిదో స్థానంలో..
భారత్ ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 25.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎకానమీగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్ (4.2 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్ డాలర్లు)లు ఉన్నాయి. 3.5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీతో భారత్ ఐదవ స్థానంలో నిలుస్తోంది. 2022 నాటికి భారత్ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్లను అధిగమించగా, 2023 నాటికి జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు ఇప్పటికే ఉన్నాయి.