నియామకాలపై బుల్లిష్‌

12 Oct, 2021 06:21 IST|Sakshi

వచ్చే 12 నెలల్లో భారీగా ఉంటాయి

హెచ్‌ఎస్‌బీసీ సర్వే వెల్లడి

న్యూఢిల్లీ: భారత కంపెనీలు నియామకాల విషయంలో బుల్లిష్‌ (చాలా సానుకూలం)గా ఉన్నట్టు ‘హెచ్‌ఎస్‌బీసీ ఫారŠూచ్యన్‌ వర్క్‌ సర్వే’ తెలిపింది. కరోనా మహమ్మారి ప్రభావం నుంచి వ్యాపారాలను తిరిగి పటిష్టం చేసుకునేందుకు వీలుగా మానవ వనరులపై పెట్టబుడులు పెంచే ఉద్దేశ్యంతో ఉన్నట్టు ఈ సర్వే వెల్లడించింది. అంతర్జాతీయంగా 2,130 మంది వ్యాపార అధినేతల అభిప్రాయాలను ఈ సర్వే కోసం పరిగణనలోకి తీసుకుంది. ఇందులో భారత్‌ నుంచి 219 మంది పాల్గొన్నారు. ఆర్థిక రికవరీలో నియామకాలు కీలక పాత్ర పోషించనున్నట్టు సర్వే పేర్కొంది. ‘‘భారతీయ సంస్థల నుంచి పెద్ద ఎత్తున నియామకాలు ఉండనున్నాయి. సర్వేలో పాల్గొన్న సంస్థల్లో 80 శాతం వచ్చే 12 నెలల్లో పూర్తి స్థాయి ఉద్యోగులను పెంచుకోనున్నట్టు తెలిపాయి’’ అని ఈ సర్వే నివేదిక తెలిపింది.

ఉద్యోగులకు సంస్థ ఇచ్చే ప్రయోజనాలపై కరోనా ప్రభావం చూపించినట్టు పేర్కొంది. కరోనా సమయంలో సౌకర్యవంతమైన పనివేళలను అమలు చేసినట్టు 52 శాతం సంస్థలు చెప్పగా.. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ సదుపాయాన్ని అందించినట్టు 49 శాతం సంస్థలు తెలిపాయి. ఆరోగ్యంగా ఉండేందుకు అవగాహన, వనరుల గురించి తెలిపినట్టు 49 శాతం సంస్థలు వెల్లడించాయి. ‘‘కరోనా మమహ్మారి ప్రభావం తగ్గుతుండడంతో ఆర్థిక రికవరీకి అవకాశం ఏర్పడింది. వ్యాపార సంస్థలు వృద్ధిపై దృష్టి సారిస్తున్నాయి. సానుకూల సెంటిమెంట్‌ అండతో కంపెనీలు నియిమకాలు, నైపుణ్యాలపై పెట్టుబడులను పెంచుతున్నాయి’’ అని హెచ్‌ఎస్‌బీసీ ఇండియా కమర్షియల్‌ బ్యాంకింగ్‌ హెడ్‌ రజత్‌వర్మ తెలిపారు.

మరిన్ని వార్తలు