తగ్గిన భారతీయ పర్యాటకుల ప్రయాణ దూరం 

3 Oct, 2020 08:16 IST|Sakshi

జూన్‌–ఆగస్ట్‌ మధ్య 780 కిలో మీటర్లు

2019 ఇదే కాలంలో 1,786 కిలో మీటర్లు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ భయంతో భారతీయ పర్యాటకుల సగటు ప్రయాణ దూరం తగ్గింది. ఈ ఏడాది జూన్‌–ఆగస్ట్‌ మధ్యకాలంలో దేశీయ పర్యాటకుల సగటు ప్రయాణ దూరం 780 కిలో మీటర్లుగా నమోదైంది. గతేడాది ఇదే కాలంలో వారు ప్రయాణించిన 1,786 కిలో మీట్లరతో పోలిస్తే ఇది 56శాతం తక్కువ. ఈ విషయాన్ని డిజిటల్‌ సర్వే కంపెనీ బుకింగ్‌డామ్‌ సర్వే తెలిపింది. కరోనా ప్రేరేపిత లాక్‌డౌన్‌తో ప్రజలు ఇళ్లల్లో నిర్భందం కావడం ఇందుకు కారణమని పేర్కొంది. ప్రపంచ పర్యాటకుల సగటు ప్రయాణ దూరం 63 శాతంతో పోలిస్తే ఇది స్వల్పమని సర్వే చెప్పుకొచ్చింది.

ఇదివరకులా తాము కోరుకున్న సుదూర ప్రాంతాల సందర్శన చేయలేకపోయినప్పటికీ  తమ పరిసర ప్రాంతాల్లోనే ఉండే అద్భుతమైన స్థలాలను కనుగొనే చక్కటి అవకాశం లభించినట్లుగా పర్యాటకులు భావిస్తున్నారని సర్వేలో వెలుగు చూసింది. వసతి విషయానికొస్తే భారతీయ పర్యాటకుల ఎంపికలో మోటళ్లు, విల్లాలు హోటళ్లు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయని సర్వే వివరించింది. హైదరాబాద్, జైపూర్‌ లాంటి ప్రాచీన నాగరికత కలిగిన నగరాల సందర్శనకు పర్యాటకులు ఇప్పటికీ ఆసక్తి చూపుతున్నారని, అయితే ఇంటికి దగ్గరలో ఉన్న ప్రాంతాల సందర్శనకే వారు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు సర్వే తెలిపింది. కోవిడ్‌–19 పరిస్థితుల నేపథ్యంలో మా ప్రణాళికలు, ప్రాధాన్యతలు మారినప్పటికీ.., పర్యాటకుల ఆసక్తి మాకు భరోసాను ఇస్తుందని బుకింగ్‌డాట్‌ కంట్రీ మేనేజర్‌ రితు మల్హోత్ర తెలిపారు.

మరిన్ని వార్తలు