జెట్‌ ఎయిర్‌వేస్‌ అప్‌- జీఎం బ్రూవరీస్‌ వీక్‌

8 Oct, 2020 14:23 IST|Sakshi

రేసులో కల్రాక్‌- జలన్‌ కన్సార్షియం ముందంజ!

5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌కు జెట్ ఎయిర్‌వేస్‌

క్యూ2లో నిరుత్సాహకర ఫలితాలు

5 శాతం పతనమైన జీఎం బ్రూవరీస్‌ షేరు

వరుసగా ఐదో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాల దౌడు తీస్తున్నాయి. ప్రధానంగా ఐటీ రంగం మార్కెట్లకు జోష్‌నిస్తోంది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 417 పాయింట్లు జంప్‌చేసి 40,296 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో కంపెనీ కొనుగోలు రేసులో కల్రాక్‌- జలన్‌ కన్సార్షియం ముందంజలో ఉన్నట్లు వెలువడిన వార్తలు జెట్‌ ఎయిర్‌వేస్‌ కౌంటర్‌కు బూస్ట్‌నిచ్చాయి. కాగా.. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో లిక్కర్‌ తయారీ కంపెనీ జీఎం బ్రూవరీస్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు లాభాలతో సందడి చేస్తుంటే.. జీఎం బ్రూవరీస్‌ నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం..

జెట్‌ ఎయిర్‌వేస్‌
విమానయాన సేవల కంపెనీ జెట్‌ ఎయిర్‌వేస్‌ విక్రయానికి ఎస్‌బీఐ అధ్యక్షతన రుణదాతల కన్సార్షియం నిర్వహించిన బిడ్డింగ్‌లో కల్రాక్‌- జలన్‌ కన్సార్షియం ముందంజలో నిలుస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. రుణ భారం, నష్టాలతో కుదేలైన జెట్‌ ఎయిర్‌వేస్‌.. బ్యాంకులకు రూ. 8,000 కోట్లకుపైగా బకాయి పడింది. మొత్తం రూ. 40,000 కోట్లవరకూ రుణాలున్నట్లు అంచనా. దీంతో జెట్‌ ఎయిర్‌వేస్‌ విక్రయానికి ఎన్‌సీఎల్‌టీ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో బ్యాంకింగ్‌ కన్సార్షియం బిడ్డింగ్‌ను చేపట్టింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ కొనుగోలుకి కల్రాక్‌- జలన్‌ కన్సార్షియం దాఖలు చేసిన బిడ్‌కు బ్యాంకులు అత్యధికంగా ఓటింగ్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ వార్తలతో జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 30.10 వద్ద ఫ్రీజయ్యింది.

జీఎం బ్రూవరీస్‌
ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో జీఎం బ్రూవరీస్‌ నికర లాభం 43 శాతం క్షీణించి రూ. 11 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం 40 శాతం తగ్గి రూ. 73 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం 37 శాతం నీరసించి రూ. 15 కోట్లను తాకింది. ఈ నేపథ్యంలో జీఎం బ్రూవరీస్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో తొలుత 5 శాతం  పతనమై రూ. 381కు చేరింది. ప్రస్తుతం 4.4 శాతం నష్టంతో రూ. 386 వద్ద ట్రేడవుతోంది. 

>
మరిన్ని వార్తలు